రాయపర్తి, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి అన్నారు. బాలాజీతండా జీపీ పరిధిలోని టేకులతండాకు నూతన మెటల్, బీటీరోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ బానోత్ కౌసల్య-హనుమానాయక్తో కలిసి సోమవారం ప్రారంభించారు. సరైన రోడ్డు సౌకర్యం లేక బాలాజీతండా వాసులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
తండావాసుల కష్టాలకు చలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సన్నూరు రోడ్డు నుంచి టేకులతండా వరకు మెటల్, బీటీరోడ్ల నిర్మాణం కోసం రూ. 96 లక్షలు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఎర్రబెల్లి కృషి ఫలితంగానే రాష్ట్రంలోని అత్యధిక గిరిజన తండాలు నూతన గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ఊకల్ సర్పంచ్ కుంచారపు హరినాథ్, కార్యదర్శి ఎంబడి తిరుపతి పాల్గొన్నారు.