హనుమకొండ, అక్టోబర్ 18: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. బుధవారం ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనగా, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేసారో ఇక్కడి ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. వారి పాలనలో ఏనాడైనా ములుగు గురించి పట్టించుకోవడం, మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అని మంత్రి ధ్వజమెత్తారు. విభజన హామీల గురించి పార్లమెంట్లో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. అలాగే, ములుగు గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కళాశాల మంజూరుపై మాట్లాడారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కాంగ్రెస్ హయాంలో జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
రామప్పను ఎందుకు పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతోపాటు అంతర్జాతీయ వారసత్వ సంపదగా గౌరవం దక్కిందని స్పష్టం చేశారు. ములుగును జిల్లా చేసింది కూడా సీఎం కేసీఆరేనని గుర్తుచేశారు. ములుగులో మెడికల్ కాలేజీ, జిల్లా హాస్పిటల్ను ఏర్పాటు చేసి, ఏటూరు నాగారాన్ని డివిజన్ కేంద్రం చేసి పరిపాలనను ప్రజల ముంగిట్లోకి తెచ్చింది సీఎం కేసీఆర్ కాదా అన్నారు. ములుగు ప్రజల ఆకాంక్షను గౌరవించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. బీడువారిన అటవీ ప్రాంతం ఈరోజు పచ్చని తోరణంలా మారిందన్నారు. ఇంటర్నేషనల్ టూరిజం కేంద్రంగా నేడు ములుగు నిలిచిందన్న మంత్రి ఎర్రబెల్లి గుర్తుచేశారు. ఎన్నికలప్పుడు వచ్చే వారిని ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు.