దేవరుప్పుల, మార్చి 30 : దేవాదుల రిజర్వాయర్లలో నీళ్లున్నా పంటలకు ఇవ్వలేని పాలకులను నిలదీసి రైతులకు తానున్నానంటూ భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం రైతుల చెంతకు వస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేవరుప్పుల మండలం చింత బాయితండా వద్ద ఎండిన పొలాలను పరిశీలించేందుకు ఆదివారం కేసీఆర్ వస్తున్న సందర్భంగా శనివారం ఆయన ముందస్తుగా పర్యటించా రు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 గంటలకు కేసీఆర్ ధరావత్ తండా పరిధిలోని చింత బావితండా, పచ్చర్లబావి తండా పరిధిలో ఎండిన వరి పొలాలను పరిశీలిస్తారని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏడాదిలో రెండు సార్లు దేవాదుల రిజర్వాయర్ల నీటిని చెరువులు, చెక్డ్యాముల్లో నింపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి చేతగానితనంతో రైతులకు సాగు నీరు అందడంలేదన్నారు.
ఈ విషయంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడుతారన్నారు. మార్పు కోరిన రైతులు పంటలను మాడ్చుకున్నారని, ఇకనైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే పాత రోజులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, కొల్లూరు సోమయ్య, చింత రవి, మలిపెద్ది శ్రీనివాస్రెడ్డి, నవీన్నాయక్,వంగ అర్జున్, సోమనర్సయ్య, కృష్ణమూర్తి, కారుపోతుల యాదగిరి, బస్వ వెంకన్న, మహేశ్, బొందుగుల సోమయ్య ఉన్నారు.