వరంగల్, ఆగస్టు 21(నమస్తేతెలంగాణ ప్రతినిధి)/వరంగల్ (నమస్తేతెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఎలక్షన్లకు దాదాపు నాలుగు నెలల ముందుగానే గెలుపు గుర్రాలను బరిలో నిలిపి మరోసారి దమ్మున్ననేతగా నిలిచారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, తొమ్మిది చోట్ల సిట్టింగ్లకే మళ్లీ బెర్త్ కన్ఫార్మ్ చేశారు. స్టేషన్ఘన్పూర్ నుంచి ఈ సారి కడియం శ్రీహరికి, ములుగులో ఆదివాసీ బిడ్డ అయిన బడే నాగజ్యోతికి అవకాశం కల్పించారు. సీనియారిటీ, సమర్థత, సామాజిక సమతూకానికి ప్రాధాన్యమిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆయా నియోజకవర్గాల్లో పట్టున్నవారికే పట్టంగట్టి, ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉన్న బీజేపీ, కాంగ్రెస్లను కండ్లు తేలేసేలా చేశారు. వివిధ కారణాలతో పెండింగ్లో పడిన జనగామ స్థానానికి మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థి ఎవరన్నది తేలనుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు దాదాపు నాలుగు నెలలు ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. సీనియారిటీ, సమర్థత, సామాజిక సమతూకం మేరకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 సెగ్మెంట్లలో తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం కల్పించారు. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, డోర్నకల్, వర్ధన్నపేట, పరకాల, మహబూబాబాద్, భూపాలపల్లి, నర్సంపేట, వరంగల్ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్ మరోసారి అదే సెగ్మెంట్ల నుంచి గులాబీ పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. స్టేషన్ ఘన్పూర్ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశమిచ్చారు. ములుగు సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఈసారి ఆదివాసీ మహిళ బడే నాగజ్యోతికి ఛాన్స్ ఇచ్చారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. త్వరలోనే ఈ సెగ్మెంట్లో అభ్యర్థిపై బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణ యం తీసుకోనున్నది. బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో రాజకీయ అనుభవం, పరిపాలనా సమర్థతకు ప్రాధాన్యత దక్కింది. ఆయా నియోజకవర్గాలపై పట్టున్న నాయకులుగా ప్రస్తుత అభ్యర్థులకు గుర్తింపున్నది.
వరుసగా మూడోసారి సతీష్కుమార్
హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి వొడితల సతీష్ బరిలో నిలుస్తున్నారు. వరుసగా మూడోసారి ఈ సెగ్మెంట్లో ఆయనకు అవకాశం దక్కింది. సతీష్కుమార్ ఎంపిక సీనియారిటీ, బ్రాహ్మణ సామాజికవర్గానికి గుర్తింపుగా ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మంథని పుట్టమధుకే..
మంథని అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. 2014లో ఈ స్థానంలో పుట్ట మధు గెలిచారు. పుట్ట మధు సీనియారిటీకి గుర్తింపుగా బీఆర్ఎస్ మరోసారి మధుకు అవకాశం ఇచ్చింది.
హుజూరాబాద్ నుంచి కౌశిక్రెడ్డి
హుజూరాబాద్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డికి గులాబీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. పాడి కౌశిక్రెడ్డి గత ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్లో పోటీ చేశారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కీలకంగా ఉన్నారు.
ఇల్లెందు నుంచి హరిప్రియ.. భద్రాచలం వెంకటరావు
ఇల్లెందు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బానోత్ హరిప్రియా నాయక్కు బీఆర్ఎస్ అధిష్టానం అవకాశం కల్పించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హరిప్రియకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకటరావు బరిలో ఉంటున్నారు.
అభివృద్ధిపై నన్నపునేని ముద్ర..
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 1995లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో టీఆర్ఎస్లో చేరిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించారు. 2014లో టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో మేయరుగా ఎన్నికయ్యారు. 2018 డిసెంబర్ 24 వరకు మేయరుగా పనిచేశారు. 2018లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలిసారి వరంగల్తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రపై 28,782 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2021లో వరంగల్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది. ఇటీవల ఇక్కడ ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్ స్థలంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దేశంలోనే అతి పెద్ద హాస్పిటల్ నిర్మాణం 24 అంతస్తులతో వరంగల్లో రూ.1,116 కోట్ల అంచనా వ్యయంతో జరుగుతోంది. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో జరిగినందున బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీలో ఉంటే తనదే రెండోసారి గెలుపు అనే ధీమాను నరేందర్ వ్యక్తం చేస్తున్నారు.
ఐదోసారి పశ్చిమ బరిలో దాస్యం..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా దాస్యం వినయ్భాస్కర్ బరిలో నిలుస్తున్నారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు సన్నద్ధమయ్యారు. దాస్యం 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో పశ్చిమ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లో ఈ పార్టీ అభ్యర్థి మాత్రమే గెలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఇక్కడ సునాయసమేనని అంచనాలు చెబుతున్నాయి. దాస్యం తెలంగాణ ఉద్యమం నుంచి కీలకంగా పని చేశారు. టీఆర్ఎస్ వరంగల్ నగర పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తూనే కార్పొరేటర్గా గెలిచి ఆ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. 2018లో గెలిచిన అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్గా వ్యవహరిస్తున్నారు.
ఉద్యమ నేతగా పెద్దికి గుర్తింపు..
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుటుంభానికి అత్యంత సన్నిహితుడిగా, ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ 2001లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. జడ్పీలో పార్టీ ఫ్లోర్ లీడర్గా కొనసాగారు. 2004లో పెద్ది టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా ఎన్నికయ్యారు. 2005లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై టీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పని చేశారు. 2006 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. మహాగర్జన వంటి చరిత్రాత్మక సభలు పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కేంద్రంగా జరిగిన అన్ని సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట నుంచి బరిలో నిలిచిన పెద్ది ఓడిపోయారు. అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై 16,949 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. పలు పైలట్ ప్రాజెక్టులతో పాటు మెడికల్ కాలేజీ, ఉద్యాన పంటల పరిశోధన కేంద్రం సాధించి నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. రెండోసారి విజయం తనదేననే ధీమాతో ముందుకు వెళ్తున్నారు.
మూడు ఎస్టీ, రెండు ఎస్సీ రిజర్వ్డ్
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో మూడు ఎస్టీ రిజర్వ్డ్, రెండు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. మిగిలిన ఏడు సెగ్మెంట్లలో జనగామ మినహా ఆరు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఆరు స్థానాల్లో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు స్థానాలను బీసీలకు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం స్థానాల్లో ఏడు సెగ్మెంట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. ములుగులో ఆదివాసీ మహిళకు బీఆర్ఎస్ మొదటిసారి అవకాశం ఇచ్చింది. బీసీల్లోని బలమైన సామాజికవర్గానికి చెందిన నేతగా ఉన్న పుట్ట మధును బీఆర్ఎస్ మరోసారి మంథని అభ్యర్థిగా ప్రకటించింది. ఆదివాసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకటరావుకు బీఆర్ఎస్ మరోసారి అవకాశం కల్పించింది. ఎస్టీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఈసారి సమతూకం పాటించింది. ఈ వర్గంలోని లంబాడా, ఆదివాసీలను అభ్యర్థులుగా నిలిపింది.