సుబేదారి/జనగామ రూరల్/జనగామ టౌన్/రఘునాథపల్లి, జూలై5 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ శ్రేణులను పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. నాయకులు, కార్యకర్తలను ఆదివారం తెల్లవారుజామునుంచే అదుపులోకి తీసుకున్నారు. తమను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించగా, తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని బెదిరించి స్టేషన్కు తీసుకొచ్చారు. సా యంత్రం వరకు అక్కడే ఉంచారు. కేటీఆర్ హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి కాన్వాయ్తో బయలు దేరిన వెంటనే పోలీసు యంత్రాగం అలర్ట్ అయింది. దారిపొడవునా పెద్ద ఎత్తున పోలీసులు రోడ్లుపైకి వచ్చారు.
జనగామ జిల్లా పెంబర్తి నుంచి జనగామ, స్టేషన్ఘన్పూర్, వరంగల్ ఔటర్ రింగ్రోడ్డు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం గూడెప్పాడ్, పరకాల, భూపాలపల్లి, కన్నెపల్లి వరకు ప్రధార రహదారి వెంట పోలీసు బలగాలు కేటీఆర్ కాన్వాయ్ని ఫాలో అయి పార్టీ శ్రేణులను బారికేడ్లు, వాహనాలు అడ్డుపెట్టి నిలువరించారు. జనగామ పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. హైదరాబాద్ నుంచి కేటీఆర్ కాన్వాయ్లో వచ్చిన వాహనాలను తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక్క వాహనాన్ని వెళ్లకుండా పోలీ సులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట ఏసీపీలు భీమ్శర్మ, నర్సయ్యను కేటీఆర్ ప్రశ్నించారు.
దీంతో జన గామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మాలోత్ కవిత, సత్యవతి రాథోడ్, బొల్లం మల్లయ్య యాదవ్, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేయగా పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో పలువురి దుస్తులు చినిగాయి. అరగంట తర్వాత కేటీఆర్ తోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వాహనాల కాన్వాయిని పోలీసులు వదిలిపెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందస్తుగా వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయ డంపై పార్టీ నాయకత్వం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేటీఆర్కు స్వాగతం పలికేందుకు పెంబర్తి, కోమల్ల టోల్గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో అనుచరులతో వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోమల్లలో జనగామ డీసీపీ రాజామహేంద్రనాయక్తో వాగ్వాదానికి దిగారు. దీంతో అర్ధ గంట ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ను పోలీసులు అడ్డుకోవడం పిరికిపందల చర్య గా పల్లా అభివర్ణించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని అన్నారు.