కొడకండ్ల, మే 27 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆరు దశాబ్దాల్లో అమలుకాని అభివృద్ధి పనులు తొమ్మిదేళ్లలోనే జరిగాయన్నారు. శనివారం మండల కేంద్రంలోని సీతారామ ఫంక్షన్ హాల్లో కొడకండ్ల 1, 2 ఎంపీటీసీల పరిధిలో, ఏడునూతుల, నర్సింగపురం, రేగుల, రేగులతండా, రంగాపురం ఎంపీటీసీల పరిధిలో ఏడునూతులలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. నర్సింగపురంలో రూ.16లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులకు ఆయన శంకుస్థాపనచేశారు. రూ.60లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ రైతును రాజు చేశారని, రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు ఆసరా పింఛన్లతో ఆయా వర్గాలకు అండగా నిలిచారని వివరించారు.
మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం కుట్రలు
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే సీఎ కేసీఆర్ తిప్పికొట్టారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వ్యవసాయానికి ఉచితంగా నిరంతర విద్యుత్ ఇస్తుండడంతో పంటల సాగు పెరిగిందన్నారు. ఏటా విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,500కోట్లు చెల్లిస్తున్నదన్నారు. రైతు చనిపోతే మృతుడి కుటుంబానికి 10 రోజుల్లో రైతుబీమా కింద రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి రైతులకు అండగా నిలిచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్నదని వివరించారు. తెలంగాణకు నయాపైసా ఆర్థికసాయం చేయని కేంద్రంలోని బీజేపీ పాలకులు ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వడంలేదన్నారు. ఇటీవల అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లితే సీఎం కేసీఆర్ గ్రామాలు పరిశీలించారని, రైతుల సమస్యలు తెలుసుకుని ఎకరాకు రూ.10వేలు పరిహారం ప్రకటించారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా రూ.3వేలకు మించి పరిహారం ఇవ్వడంలేదన్నారు. 57 ఏండ్లు నిండిన అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. కొత్త గ్రామ పంచాయతీల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. దీనిని ఓర్వలేని విపక్షాలు సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. దీనిని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిందె రామోజీ, కొడకండ్ల మార్కెట్ చైర్మన్ పేరం రాము, టీఎస్ ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య పాల్గొన్నారు.