శాయంపేట, మార్చి 31 : గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రగతిసింగారం గ్రామంలో క్లస్టర్-1 గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు తిరుగుతున్నారని, వారికి గ్రామాల్లో తిరిగే అర్హత లేదన్నారు. నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని చెప్పిన మోదీ వేశాడా? అని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ తుగ్లక్ పాలనతో దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదనారు. తనకు ఎవరూ లేరని మోదీ చెబుతున్నాడని కానీ, గౌతమ్ అదానీ, అంబానీకి దేశ సంపదను దోచి పెడుతున్నాడన్నారు. అదానీ విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీని వేయాలని బీఆర్ఎస్, విపక్షాలు కోరుతున్నా ఎందుకు వేయడం లేదన్నారు. అతి తక్కువకు బొగ్గు మనదగ్గర దొరుకుతుంటే విదేశాల్లో కొనుగోలు చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అక్కడ కల్యాణలక్ష్మి, 24 గంటల కరంటు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నారా? అంటే సమాధానం లేదన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మోదీ వల్ల పేదలు, నిరుద్యోగులు, రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. అదానీని మాత్రం ఎనిమిదేళ్లలో ప్రపంచంలో రెండో ధనవంతుడిని చేశారని అన్నారు. ఒక రాజకీయ మార్పుకోసం బీఆర్ఎస్ ఏర్పాటైందన్నారు. నాడు సుభాష్చంద్రబోస్ దేశం కోసం పోరాటం చేశారో అలాగే నేడు కేసీఆర్ పోరాడుతున్నారన్నారు. కేసీఆర్ వెంట 60 లక్షల మంది సైనికులు ఉన్నారన్నారు. రాహుల్గాంధీపై అనర్హత వేటు వేస్తే మొదట ప్రశ్నించిన నేత సీఎం కేసీఆర్ అని అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. మన ఊరు, మన రమణన్న పేరుతో తాను శుక్రవారం నుంచే ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర ప్రకటించారు. గ్రామాల్లో నిద్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటానన్నారు.
సీఎం కేసీఆర్ దేశ ప్రధానమంత్రి కావడం ఖాయమని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ నాయకులు మాయమాటలు చెప్పి గ్రామాల్లో అయోమయం సృష్టిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దీన్ని అడ్డుకోవాలన్నారు. ప్రజలకు కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే గండ్ర దంపతులు ఊరూరా బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. క్లస్టర్-1లోని నేరేడుపల్లి, అప్పయ్యపల్లి, ప్రగతిసింగారం, నూర్జహాన్పల్లి, కాట్రపల్లి, కొప్పుల, రాజుపల్లి, సాధన్పల్లి, పత్తిపాక, వసంతాపూర్, గంగిరేణిగూడెం, సూర్యనాయక్తండాకు చెందిన సర్పంచ్, ఎంపీటీసీ, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో విడివిడిగా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మనోహర్రెడ్డి, వైస్ ఎంపీపీ లత,గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.