మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 19 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు లేదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల పాదయాత్ర మహబూబాబాద్ పట్టణంలో శనివారం సాయంత్రం కొనసాగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే శంకర్నాయక్పై రెచ్చగొట్టేలా షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఆదివారం ఉదయం బేతోలు గ్రామ రోడ్డుపై నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మరిపెడ వైపు వెళ్లే హైవేపై భజనతండాకు, బేతోలు గ్రామానికి, షర్మిల క్యాంపు సమీపంలోని రోడ్డు వద్దకు ఉదయం 5 గంటలకే చేరుకున్నారు. అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.., ‘వైఎస్ఎస్ షర్మిల గో బ్యాక్.. ఆంధ్రా వసల వాదులకు తెలంగాణలో చోటు లేదు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలో ఎమ్మెల్యే శంకర్నాయక్ సతీమణి సీతామహాలక్ష్మీ పాల్గొన్నారు.నియోజక వర్గం నుంచి భారీగా మహిళలు తరలివచ్చారు. షర్మిల పాదయాత్ర ప్లెక్సీలను దగ్ధం చేశారు. షర్మిల బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా షర్మిల స్పందించకపోవడంతో ఆమె క్యాంపు వైపు దూసుకెళ్లడానికి యత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. షర్మిల క్షమాపణలు చెప్పాలని కొంతమంది నాయకులు క్యాం పుపై రాళ్లను విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ షర్మిల పాదయాత్ర అనుమతిని రద్దు చేస్తూ నోటీస్లు అందజేశారు. ఈ క్రమంలో మళ్లీ బీఆర్ఎస్ నాయకులు షర్మిల క్యాంపు వైపు దూసుకెళ్లగా పోలీసులు వారిని చెదరకొట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్కు పంపించారు.
అభివృద్ధి కండ్లకు కనిపించడం లేదా..?
– ఎండీ ఫరీద్, మున్సిపల్ వైస్ చైర్మన్
ఆంధ్రానాయకులు తెలంగాణ వనరులు దోచుకుని ఈ ప్రాంతానికి నష్టం చేయడంతోనే సీఎం కేసీఆర్ నాడు ఆమరణ దీక్ష చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. యావత్ భారత దేశమే గర్వించేలా తెలంగాణ రాష్ర్టాన్నిఅభివృద్ధి చేస్తున్న కేసీఆర్పై షర్మిల చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చెరువులను నింపి రెండు పంటలకు సరిపడా నీళ్లిస్తున్న విషఁం షర్మిల కండ్లకు కనబడటం లేదా ? సమైక్య పాలనలో వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించి రైతులను అనేక ఇబ్బందులు గురిచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉచితంగా నిరంతర విద్యుత్ అందిస్తుంటే షర్మిల యాత్రల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే శంకర్నాయక్ 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యేపై తప్పుడు వ్యా ఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. జిల్లాలో షర్మిల చేసిన పాదయాత్రలో ఒక్క తెలంగాణ బిడ్డ కూడా లేడు. కడప, కర్నూలు జిల్లాల నుంచి కిరాయి రౌడీలను తెప్పించి రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తున్నది. రానున్న రోజుల్లో ప్రజలే షర్మిలకు తగిన గణపాఠం చెబుతరు.
షర్మిలా.. నోరు అదుపులో పెట్టుకో..
తెలంగాణలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని 10 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత తెలంగాణ సర్కారుది. గత పాలకులు లంబాడా సోదరులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం గిరిజనులకు సౌకర్యాలు కల్పిస్తున్నరు. ఎమ్మెల్యే శంకర్నాయక్ దంపతులపై షర్మిల తప్పుడు ప్రచారం చేస్తే సహించం. ఇప్పటికైనా కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే తీవ్ర పరిణామాలుంటయని హెచ్చరిస్తున్నం.
– గుగులోత్ లక్ష్మి, రేగడితండా గ్రామ సర్పంచ్
ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు..
సీఎం కేసీఆర్ నేతృత్వంలో మానుకోట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. యాత్రల పేరిట షర్మిల వచ్చి మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యేను విమర్శించే అర్హత షర్మిలకు లేదు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షర్మిలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
– మార్నేని శ్రీదేవి, కౌన్సిలర్
దోచుకున్నోళ్లే మళ్లీ యాత్రలకు వస్తున్నారు..
బయ్యారంలో ఉన్న ఉక్కును మొత్తం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దోచుకున్నారు. గతంలో అనేక వనరులు దోచుకునిపోయారు. మళ్లీ యాత్రల పేరిట తెలంగాణకు వస్తున్నారు. ఒక మహిళ అయి ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేపై ఇష్టమొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరు. ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చిరిస్తున్నాం.
– జడ్పీటీసీ లూనావత్ ప్రియాంక
వైఎస్ షర్మిలపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు..
వైఎస్ షర్మిల కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే శంకర్నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేసిందని బీఆర్ఎస్ నాయకుడు లూనావత్ అశోక్ మానుకోట టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ సతీశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డమెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.