హసన్పర్తి/ధర్మసాగర్, డిసెంబర్ 26: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని బావుపేట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు సోమయ్య(55), బొడ్డు సుదర్శన్(58)లు అన్నదమ్ములు. బాహుపేటలో వారి బంధువులు మృతి చెందగా మంగళవారం బైక్పై అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో బావుపేట క్రాస్ వద్ద వీరి ద్విచక్ర వాహనాన్ని సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేములవాడ నుంచి వరంగల్కు వస్తూ ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థ్ధానికులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. అన్నదమ్ములు మృతి చెందడంతో ధర్మసాగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, బొడ్డు సోమయ్య భార్య శోభ ఎంపీటీసీ. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే టీ రాజయ్య ఎంజీఎం దవాఖాన వద్ద మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసి వారికి మనోధైర్యం కల్పించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.