రాయపర్తి (వరంగల్) : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్( Chief Minister KCR) తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador) అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli ) అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గన్నారం, కేశవాపురం, తిర్మలాయపల్లి గ్రామాల్లో జరిగిన బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ వస్తుందని పేర్కొన్నారు. దీనిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రతిపక్ష పార్టీలు (Opposition parties) రాష్ట్రం నుంచి కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తమ పార్టీల ఉనికిని చాటుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నాయని మండిపడ్డారు.
ప్రజల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయల వ్యయంతో అనేక సంక్షేమ కార్యక్రమాల(Welfare Programmes)తో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు అండగా నిలువాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తే దేశ రాజకీయాలను శాసించే శక్తిగా రాష్ట్రం అవతరిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉష, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు,ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు గజవెల్లి అనంత ప్రసాద్, కుక్కల భాస్కర్, గుగులోతు సుందర్నాయక్, చిలుముల ఎల్లమ్మ యాకయ్య, బానోత్ శ్వేత, గుగులోత్ బీకోజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.