కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రికాషనరీ (బూస్టర్) డోస్పై ప్రత్యేక దృష్టి సారించింది. అర్హులైన వారందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ అందించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. అలాగే, ఇంటింటికీ వెళ్లి టీకా వేయాలని అధికారులను ఆదేశించింది. విద్యాసంస్థల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే వెళ్లి టీకా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా విద్యాసంస్థల్లో మంగళవారం నుంచి విద్యార్థులకు బూస్టర్ డోస్ వేసేందుకు రెడీ అయ్యారు. మిషన్ మోడ్ తరహాలో బూస్టర్ డోస్ కార్యక్రమం నిర్వహిస్తామని, జిల్లాలో వ్యాక్సిన్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకొంటున్నామని డీఎంహెచ్వో వెంకటరమణ చెప్పారు.
వరంగల్, జూలై 25 (నమస్తేతెలంగాణ) : పద్దెనిమిదేళ్ల వయసు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న ప్రారంభించింది. అదేరోజు జిల్లాలోని వరంగల్ ఎంజీఎం, సీకేఎం, నర్సంపేట, వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల(యూపీహెచ్సీ)లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బూస్టర్ డోస్ పంపిణీని మొదలుపెట్టారు. మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్వో) వెంకటరమణ కొద్ది రోజుల నుంచి పలు పీహెచ్సీలు, యూపీహెచ్సీలను సందర్శించి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఇప్పటివరకు నిర్దేశిత లక్ష్యంలో రెండుశాతం వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు.
సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమశాఖల మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్తో కలిసి సీజనల్ వ్యాధులు, డెంగీ, మలేరియా నియంత్రణ, పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార నాణ్యతా ప్రమాణాలు, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో, ఆదివారం పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్న దరిమిలా సమన్వయంతో పనిచేసి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బూస్టర్ డోస్ కార్యక్రమం వేగవంతం చేయాలని, ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారందరికీ వేయాలని ఆదేశించారు. ఆగస్టు వరకు ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించి 12 నుంచి 17 ఏళ్ల వయసు గల విద్యార్థులకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రులు అధికారులకు చెప్పారు.
నేటి నుంచి స్కూళ్లల్లో..
ప్రభుత్వ ఆదేశాలతో విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు మంగళవారం నుంచి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు డీఎంహెచ్వో కే వెంకటరమణ ప్రకటించారు. పాఠశాలల్లో 12 నుంచి 15, కళాశాలల్లో 15 నుంచి 20 ఏళ్ల వయసు గల విద్యార్థులు ఉంటారని, విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వ్యాక్సిన్ వేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ కోసం విద్యాశాఖ అధికారులకూ ప్రభుత్వ ఆదేశాలు అందాయని, ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పీహెచ్సీలు, యూపీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు సమన్వయంతో ముందుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించినట్లు డీఎంహెచ్వో వెల్లడించారు. 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట సీహెచ్సీలతో పాటు పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నదని, అరవై ఏళ్ల వయసు పైబడిన వారికి ఇంటింటికీ వెళ్లి డోస్ వేస్తామని చెప్పారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఈ విధుల్లో పాల్గొంటారని, ఈ వారంలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. మిషన్ మోడ్ తరహాలో బూస్టర్ డోస్ కార్యక్రమం నిర్వహిస్తామని, జిల్లాలో వ్యాక్సిన్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.