బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా సాగుతున్నది. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు దాడులకు తెగిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్లో మంగళవారం జరిగిన సంఘటనలు రెచ్చగొట్టే చర్యల్లో భాగమేమని స్పష్టమవుతున్నది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో బౌన్సర్లు, గూండాలను వెంటబెట్టుకుని బండి సంజయ్ పాదయాత్రకు వచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, సామాన్య ప్రజలపై దాడులు చేసి ఇతరులపై నింద వేశారు. ముఖ్య నాయకుల తీరుపై పార్టీలోనే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కార్యక్రమం మొత్తం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా నడుస్తున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోకి పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇదే తీరుగా సాగుతున్నది. బండి సంజయ్ యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో దాడులకు తెగబడుతున్నారు. ఎలాగైనా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్లో మంగళవారం జరిగిన సంఘటనలు బీజేపీ రెచ్చగొట్టే చర్యల్లో భాగమేమని స్పష్టమవుతున్నది. ప్రజలకు ఏం చెప్పాలో తెలియకపోవడం వల్లనే బీజేపీ ముఖ్యనేతల దాడులు వ్యూహాలను అమలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారికి ఏం చేస్తామనేది ఎక్కడా చెప్పకుండా పాదయాత్ర సాగుతున్నదని… అందుకే ఎక్కడా స్పందన రావడంలేదని అంటున్నారు. బండి సంజయ్ పాదయాత్ర వరంగల్ ఉమ్మడి జిల్లాలోకి మొదలైన రోజే బీజేపీ దాడుల వ్యూహానికి పదును పెట్టింది. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో బండి సంజయ్ బౌన్సర్లు, గూండాలను వెంటబెట్టుకుని పాదయాత్రకు వచ్చారు.
యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలపై, సామాన్య ప్రజలపై దాడుల చేశారు. బౌన్సర్లు, గూండాల దాడిలో నలుగురు టీఆర్ఎస్ కార్యకర్తల తలలు పగిలాయి. బీజేపీ వాళ్లు చేయించిన దాడిలో సత్తమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. టీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడినా ఆ పార్టీ వారు ఓపిక పట్టారు. వారం రోజులు గడిచినా పాదయాత్రను ప్రజలు ఎవరూ పట్టించుకోవడంలేదు. బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ సెగ్మెంట్లోని కొందరిని రప్పించి రోజూ పాదయాత్రలో వెంట ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. పాదయాత్రకు అసలే స్పందన లేకపోవడంతో బీజేపీలో ఆలోచన మొదలైంది. మునుగోడులో అమిత్షా పర్యటన కారణంతో ఆదివారం యాత్రకు విరామం ఇచ్చిన బండి సంజయ్ సోమవారం కొనసాగించారు. బహిరంగసభ తర్వాత సైతం ప్రజలలో యాత్రకు స్పందన కనిపించలేదు. దీంతో ఎలాగైనా ప్రజల దృష్టిని ఆకర్షించాలని బీజేపీ నేతలు పథకం వేశారు. అలవాటైన దాడుల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం పొద్దున బండి సంజయ్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచే దాడులకు పాల్పడేలా కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముందుగానే వారికి రాళ్లను, దాడులకు పాల్పడేందుకు అవసరమైన ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. పాదయాత్ర పేరుతో మంగళవారం జనగామ జిల్లాలో విధ్వంసం సృష్టించడానికి బండి సంజయ్ కుట్ర పన్నినట్లు అక్కడి ప్రజలే చెబుతున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయాలని బీజేపీ వాళ్లను రెచ్చగొట్టారని అంటున్నారు. దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను బెదిరించి రౌడీయిజానికి దిగినట్లుగా అక్కడి వారు వివరించారు.
చెప్పుల తిప్పలు పోయేలా..
బీజేపీ జాతీయ నేత అమిత్షా రాష్ట్ర పర్యటనలో ఆయన చెప్పులను మోసి తెలంగాణ పరువు తీసిన బండి సంజయ్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ చెప్పుల మోత వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా యువత తీవ్రంగా తప్పపడుతున్నది. బండి సంజయ్ వీడియోలను, వాటికి కామెంట్లను పెట్టి కామెంట్లు చేస్తున్నారు. అమిత్ షా చెప్పులు మోసి బండి సంజయ్ బానిస సంజయ్ అయ్యాడని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టాడని వ్యాఖ్యానించారు. బూట్లు మోయడం వంటివి కాకుండా తెలంగాణ కోసం ఏదైనా చేయాలని హితవు పలికారు.
చెప్పులు మోయడంతో వచ్చిన విమర్శలను, ఈ విషయంపై నుంచి ప్రజల దృష్టి ని మళ్లించేందుకు బండి సంజయ్ జనగామ జిల్లా పాదయాత్రలో దాడుల కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ప్రజలు ఎక్కడా లేరని, అందుకే తొండి మాటలతో గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఈ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి సరికాదని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఉన్నదని, దీక్షలకు ఎలాంటి అనుమతి లేదని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అనుమతి లేదని దీక్ష పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వల్లే బండి సంజయ్ని పోలీసులు అరెస్టు చేశారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఎవరూ ఉండడంలేదని, ఎక్కడి వారినో కొందరిని తెచ్చుకుని హడావుడి చేస్తున్నారని అంటున్నారు. పాదయాత్ర పేరుతో బండి సంజయ్ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలతో ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నదని గుర్తు చేస్తున్నారు.