SSC Paper Leak | వరంగల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పదో తరగతి హిందీ పశ్ర పత్రాన్ని సోషల్ మీడియాలో తక్కువ సమయంలో ఎక్కువ మందికి విస్తృతంగా ఫార్వర్డ్ చేసిన అందరినీ విచారించేందుకు వరంగల్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పుటికే పేపరును ఫార్వర్డ్ చేసిన 100 మందికి నోటీసులు ఇచ్చారు. బీజేపీ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్కు శామీర్పేటలో, ఆయన పీఏలు పెండ్యాల రాజు, ఎదులాపురం నరేందర్లకు సైతం పోలీసులు గురువారం నోటీసులు స్వయంగా అందించారు. కాగా ఈటల ఈనెల 10న హనుమకొండ డీసీపీ కార్యాలయానికి వచ్చి స్టేట్మెంట్ ఇస్తానని చెప్పినట్లు తెలిసింది.
వేగంగా విచారణ
టెన్త్ ప్రశ్న పత్రం బయటకు వచ్చిన వ్యవహారంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు వేగంగా విచారణ కొనసాగిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బాధ్యులందరిపైనా చర్యలు తీసుకునేందుకు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఈటలకు, ఆయన పీఏలకు నోటీసులిచ్చారు. పేపరు బయటికి తెప్పించడం, దాన్ని ఎక్కువ మందికి చేరవేయడంలో కీలకంగా వ్యవహరించిన బూరం ప్రశాంత్, గుండెబోయిన ప్రశాంత్ ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలో బూరం ప్రశాంత్ ఫోన్ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు, మరో నిందితుడు గుండెబోయిన మహేశ్ ఫోన్ నుంచి ఈటల రాజేందర్ పీఏలు రాజు, నరేందర్కు పశ్నపత్రం వాట్సాప్లో చేరింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు, మంచిర్యాల జిల్లా రామకృష్ణపురానికి చెందిన నరేందర్ ఫోన్ల నుంచి మరికొంత మందికి ఫార్వర్డ్ అయినట్లుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా వీరికీ నోటీసులు ఇచ్చారు.
ఫార్వర్డ్ చేసిన అందరికీ..
ప్రశ్నపత్రాన్ని సోషల్ మీడియాలో తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేసిన అందరినీ విచారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 100 మందికి నోటీసులిచ్చారు. పేపరు బూరం ప్రశాంత్తోపాటు ఎక్కువ మందికి ఫార్వర్డ్ కావడానికి కారణమైన కమలాపూర్కు చెందిన ఎస్ఎస్సీ 2019-20 వాట్సాప్ గ్రూపుపైనా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రూపు అడ్మిన్గా ఉన్న కార్తీక్తోపాటు పేపర్ను ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేసిన ప్రతి ఒక్కరినీ విచారణకు పిలిచారు. ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఎవరెవరు షేర్ చేశారో వారందరినీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగానే చాలా మంది తమ ఫోన్లలో డాటాను డిలీట్ చేశారు. పోలీసులు సాంకేతికతను వినియోగించి ఫార్వర్డ్ చేసిన అందరి వివరాలను సేకరిస్తున్నారు.
కమలాపూర్, ఏప్రిల్ 6 : కమలాపూర్ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో పదో తరగతి విద్యార్థి దండెబోయిన హరీశ్ను విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిబార్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను అందించి ఆ విద్యార్థిని పరీక్ష కేంద్రం నుంచి హనుమకొండ జిల్లా విద్యాధికారి అబ్దుల్ హై గురువారం బయటకు పంపించారు. దీంతో పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన హరీశ్ తన తల్లితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తనకు ఏ పాపం తెలియదన్నాడు. పరీక్ష కేంద్రంలో జవాబు పత్రాన్ని ఫోల్డ్ చేసుకుంటుండగా కిటికీ వద్దకు వచ్చిన వ్యక్తి బెదిరించి హిందీ ప్రశ్న పత్రాన్ని తీసుకొని సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నట్లు చెప్పాడు. ఎవరికి చెప్పినా చంపుతానని బెదిరించినట్లు వాపోయాడు.
కష్టపడి చదివి పరీక్ష రాసేందుకు వస్తే ఎవరో చేసిన తప్పునకు తాను బలయ్యానని కన్నీటి పర్యంతమయ్యాడు. గురువారం ఇంగ్లిష్ పరీక్ష ఉండడంతో పరీక్ష రాసేందుకు వచ్చానన్నాడు. హాల్టికెట్ తీసుకొని సంతకం పెట్టించుకుని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించినట్లు చెప్పాడు. సంబంధిత విద్యాశాఖ అధికారులు ఎంజేపీ బాలుర విద్యాలయం ప్రిన్సిపాల్కు సమాచారం ఇచ్చి విద్యార్థిని అప్పగించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఎంజేపీ విద్యాలయానికి వచ్చిన హరీశ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. ఎవరో చేసిన తప్పునకు తనకొడుకు హరీశ్ బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. కష్టపడి తన కొడుకును చదివించుకుంటున్నామని, దయచేసి మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి తన కొడుకుక్కు పరీక్ష రాసేందుకు అనుమతి ఇప్పించాలని వేడుకుంది.