కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ పరిస్థితి ఇక్కడ మాత్రం అయోమయంగానే ఉన్నది. శుక్రవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నది. రాష్ట్రంలో మొత్తం 17స్థానాలకు గాను 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ, వరంగల్లో మాత్రం తేల్చకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్కు టికెట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా, ఆ పార్టీకి సరైన నేతలు కరువైనందునే అరూరిని చేర్చుకొని టికెట్ ఇస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వరంగల్ ఎంపీ టిక్కెట్పై బీజేపీ ఎటూ తేల్చడం లేదు. శుక్రవారం నాలుగో జాబితాను ప్రకటించినా అందులో వరంగల్ పేరు లేదు. ఈ జాబితాతో కలిపి దేశ వ్యాప్తంగా 291 సీట్లకు బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 15 చోట్ల అభ్యర్థులను ప్రకటించినా వరంగల్కు ఎవరనేది మాత్రం తేల్చలేదు. అభ్యర్థిని ప్రకటించకపోవడంతో బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొన్నది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి, ప్రచారాన్ని సైతం మొదలు పెట్టింది. మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, గత ఎన్నికల్లో పోటీ చేసిన చింతా సాంబమూర్తి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి టీ కృష్ణ ప్రసాద్ ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశించినా ఆయనకు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల స్థానాన్ని బీజేపీ కేటాయించింది. దీంతో స్థానిక నేతలే ఇప్పుడు టిక్కెట్ కోసం రేసులో ఉన్నారు.
వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు బీజేపీలో సరైన నాయకులు లేనందునే ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేక పోతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మొదటి నుంచీ బీజేపీలో ఉన్న నాయకులెవరూ లేరు. గుండె విజయరామారావు, అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. కొండేటి శ్రీధర్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ ముగ్గురు నేతల్లోనే ఒకరికి టికెట్ రావాల్సి ఉన్నది. వరంగల్ స్థానంలో బీజేపీ గతంలో ఒకసారి గెలిచిందని, ఈ సెగ్మెంట్లో సరైన అభ్యర్థిని నిలిపితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పలుమార్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే కోణంలో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నది. వరంగల్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే వరకు ఆగడమా, ముందుగానే ప్రకటించడమా అనే విషయంలో ఆలోచిస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున మరో రెండుమూడు రోజుల్లో బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటనలో ముందున్న బీజేపీ, వరంగల్ సీటుపై మాత్రం నాన్చుడు ధోరణితో ఉండడం కాషాయ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నది.