ప్రతి ఆడబిడ్డా ఒక సమ్మక్కై శివమూగుతూ.. అమ్మవార్లను ఆహ్వానిస్తూ.. అడవి అంతటా ఆధ్యాత్మికత అలుముకున్నది.. కొలిచినవారి కొంగుబంగారమై నిలిచే సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో జన ప్రవాహం ఉప్పొంగుతున్నది. వన ఒడిలో ఒదిగిన మేడారంలో ప్రతి చెట్టూ పుట్టా తల్లుల ఆత్మలను ఆలింగనం చేసుకుంటూ తన్మయత్వంలో మునిగితేలుతున్నది. అష్టదిక్కులూ ఏకమై అమ్మలకోసం తరలివస్తున్న భక్తులతో వన వీధులు పులకించిపోతున్నాయి. వాగులు, వంకలు, తోగులు, సెలయేళ్లు, పక్షులు, వనజీవులు, లతల అల్లికలతో పెనవేసుకున్న ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ప్రతి మదీ పరవశించిపోతున్నది. నిన్నమొన్నటిదాకా ఓ కుగ్రామంలా ఉన్న మేడారం ఇప్పుడు మహానగరమై వెలిగిపోతుండగా జంపన్న వాగులో భక్తిపారవశ్యం పొంగిపొర్లుతున్నది. కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మను భక్తిశ్రద్ధలతో ఆహ్వానించిన వనస్థలి, నేడు సమ్మక్క రాకకోసం కోటి కన్నులతో ఎదురుచూస్తున్నది.
ఏటూరునాగారం, ఫిబ్రవరి 21: తల్లి సమ్మక్క ఉన్న చిలుకలగుట్ట సమీపం నుంచి రెండు జలధారలు వస్తుంటాయి. వాటి నీరు అమృతంలా పనిచేస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. చిలుకలగుట్టపైకి వెళ్లే దారిలో జంపన్నవాగుకు మధ్య గుట్ట దిగువన రాళ్ల మధ్య నుంచి రెండు జలధారలు వస్తుంటాయి. వీటిని సమ్మక్క-సారలమ్మ జలధారలుగా భావిస్తారు. నిత్యం ఒకే తీరుగా వచ్చే ఈ జలధారల వద్ద భక్తులు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో విడిది చేసేవారు ఈ నీటిని పట్టుకుని తాగుతుంటారు. గుట్టపై అనేక రకాల వనమూలికల వృక్షాలు ఉన్నాయని, చెట్ల వేర్లను తాకుతూ కిందకు వచ్చే జలం చల్లగా, రుచిగా ఉంటుందని భక్తుల్లో విశ్వాసం. దీంతో భక్తులు తాగడానికి, ఇంటికి తీసుకెళ్లడానికి ఈ జలాన్ని బాటిళ్లు, క్యాన్లలో నింపుకుంటారు.
గోవిందరావుపేట, ఫిబ్రవరి 21 : మండలంలోని లక్ష్మీపురం నుంచి మేడారానికి బయలుదేరిన పగిడిద్దరాజుకు ఊరూరా భక్తులు నీరాజనం పలికారు. పూనుగుండ్ల నుంచి మంగళవారం ఉదయం బయలుదేరిన పగిడిద్దరాజు రాత్రి లక్ష్మీపురానికి చేరుకొని అక్కడే బస చేశారు. బుధవారం ఉదయం గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నడుమ గుడి వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివసత్తులు, భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. అక్కడి నుంచి మొద్దులగూడెం, టపమంచ, వెంగళాపురం, నార్లాపూర్ మీదుగా మేడారానికి బుధవారం సాయంత్రం పగిడిద్దరాజు చేరుకోగా, గద్దెపై ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో పూజారులు పెనుక ఇద్దయ్య, కృష్ణయ్య, సమ్మయ్య, సమ్మక్క, సారయ్య, విజయలక్ష్మి, సత్యనారాయణ, లక్ష్మయ్య, నరేశ్, రవి, సంతోష్తో పాటు పెనుక వంశీయులు పాల్గొన్నారు.
మేడారం జాతరకు కుటుంబంతో వచ్చిన ఓ బాలుడు అమ్మవార్లకు తలనీలాలు సమర్పించాడు. జంపన్నవాగు ఒడ్డున షవర్ల కింద ఇలా జలకాలాడాడు. నీటి జల్లుల్లో శరీరాన్ని తడుముకుంటూ ‘ఒళ్లంత తుళ్లింత కావాలి లే’ అని పాడుకుంటున్నట్లుగా ఉన్న అతడు ‘నమస్తే’ కెమెరాలో బందీ అయ్యాడు.
ఏటూరునాగారం, ఫిబ్రవరి 21 : జంపన్నవాగు ఒడ్డున గద్దెపై కొలువైన సమ్మక్క తనయుడు జంపన్నకు పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. వాగులో భక్తులు పుణ్యస్నానాలాచరించిన అనంతరం జంపన్నకు కొబ్బరికాయలు కొట్టి, సంతానం కలగాలని ఎర్రగుడ్డలో కొబ్బరి కాయలను చుట్టి చెట్టుకు ముడుపులు కడుతున్నారు.
ములుగురూరల్, ఫిబ్రవరి21 : మేడారం జాతరలో పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం భక్తులకు సిబ్బంది అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ టూత్ బ్రష్లు, ఇయర్బడ్స్, పెన్నులు, గ్లాసులు, ప్లేట్లు, కేక్ కటింగ్ కత్తులతో పాటు ప్లాస్టిక్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా మట్టి, చెక్క, కాగితం, వెదురుతో తయారు చేసిన సహజ ఉత్పత్తులను వాడాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు.
వాజేడు, ఫిబ్రవరి 21: మేడారం మహాజాతరలో రంగులరాట్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా రంగుల రాట్నాలు ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో కలిసి భక్తులు సందడి చేస్తున్నారు.
సమక్క-సారక్క జాతర వేలాది మందికి ఉపాధి కూడా చూపిస్తున్నది. జాతర విధుల్లో తలమునకలైన ఓ పోలీసన్నకు ఇతగాడు ఆధునిక పద్ధతుల్లో పచ్చబొట్టు వేస్తూ ‘నమస్తే’కంటపడ్డాడు.
ఏటూరునాగారం, ఫిబ్రవరి 21 : మేడారం జాతర సందర్భంగా జంపన్నవాగు భక్తులతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం మొదట జంపన్నవాగుకు చేరుకుని తలనీలాలు సమర్పించి స్నానాలు చేస్తున్నారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర స్నానఘట్టాలు జనంతో నిండిపోయాయి. ఓ వైపు శివసత్తుల పూనకాలు, మరోవైపు చిన్నారులు వాగులో సరదాగా జలకాలాడుతూ కనిపించారు. ముందుజాగ్రత్తగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సెక్టోరల్ అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.