దేవరుప్పుల, మార్చి 20: మండల కాంగ్రెస్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని మార్చడంతో విభేదాలు భగ్గుమన్నాయి. చాలాకాలంగా ఉన్న గ్రూపు తగాదాలు పార్టీ మండల అధ్యక్షుడి మార్పుతో రోడ్డెక్కాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా రెండేళ్లుగా కొనసాగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన దేవరుప్పులకు చెందిన పెద్ది కృష్ణమూర్తిని తొలగించి, నీర్మాల గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్ల శ్రీరామ్కు ఆ బాధ్యతలను పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మంగళవారం అప్పగించారు.
కృష్ణమూర్తి ఒంటెత్తు పోకడలు పోతున్నారని, కార్యకర్తలు, నాయకులకు సమాచారం ఇవ్వడంలేదనే ఫిర్యాదులు రావడంతో పలుమార్లు తీరు మార్చుకోవాలని చెప్పినా నిర్లక్ష్యం వహించడంతో ఝాన్సీరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈమేరకు మంగళవారం తొర్రూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృష్ణమూర్తిని తొలగించి ఆ స్థానంలో శ్రీరాం నియామకాన్ని ప్రకటించి ఆయనను సన్మానించారు. ఈ నిర్ణయానికి మండలంలోని 27 గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆమోదం ఉందని నల్ల శ్రీరాం చెబుతున్నారు.
మండల అధ్యక్షుడి మార్పుతో పెద్ది కృష్ణమూర్తి వర్గం మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం పెద్ద ఎత్తున మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఆయన తొలగింపు అప్రజాస్వామికమని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
పోలీసులు వచ్చి ఆందోళన విరమింపజేశారు. పలు గ్రామాల మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొని ఝాన్సీరెడ్డిని దుయ్యబట్టారు. వనరులు దోచుకునేందుకే కృష్ణమూర్తిని పదవి నుంచి తొలగించి, శ్రీరాంకు అప్పగించారని బాహాటంగా ఆరోపించారు. వానకొండయ్య గుట్టపై క్వారీ పనులు చేయడాన్ని వ్యతిరేకించడంతోపాటు వాగు నుంచి టిప్పర్లలో ఇసుక తరలింపును వ్యతిరేకిస్తున్నందున వల్లే కృష్ణమూర్తిని పదవి తొలగించారని వారు ఝాన్సీరెడ్డిపై విమర్శలు చేశారు.
దేవరుప్పుల మండల పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుమలు నాగరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నల్ల మండల అధ్యక్ష పదవి కట్టబెట్టిన మాట్లాడుతుండగా వర్గం కార్యాలయంపై దాడికి దిగింది. అందులోని ఫర్నిచర్ను విసిరేసి, చెల్లాచెదురు చేశారు.
మీరంతా ఎన్నికల సమయంలో ఎటుపోయారని, కష్టపడి పనిచేసిన కృష్ణమూర్తిని ఎలా తొలగిస్తారని కార్యకర్తలు నిలదీశారు. అక్కడ ఎమ్మెల్యే యశస్విని, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం పోలీసులు కార్యాలయ షట్టర్లను కిందికి వేసి కాపలా ఉన్నారు.