నర్సంపేట రూరల్, అక్టోబర్ 28 : సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ద్వారకపేట ఎంఏఆర్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. దివ్యాంగులను ఏనాడు పట్టించుకోని నాయకులను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇదే ఫార్ములా ఫాలో కావాలన్నారు. ఒకప్పుడు రూ.200 పింఛన్ ఇచ్చి, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను అవమానపర్చిన గత ప్రభుత్వాలు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నాయనారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.4వేల పింఛన్ అందించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిదన్నారు. బీఆర్ఎస్కు మనమంతా రుణపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రాంతంతో దీర్ఘకాలిక సమస్యను సాధ్యమైనంత వరకు తీర్చగలిగామన్నారు. నర్సంపేట వ్యవసాయంలో అగ్రగామిగా నిలిచిందనారు. ధాన్యం ఉత్పత్తి పెరిగిందని, గోదాంల నిర్మాణంతో పాటు సబ్సిడీ రుణాలు, రైతు ఆర్థికంగా వృద్ధి చెందేలా పలు రకాల పైలట్ ప్రాజెక్టులు తీసుకొచ్చినట్లు తెలిపారు. నర్సంపేటను మెడికల్ కళాశాల, జిల్లా దవాఖానతో మెడికల్ హాబ్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. నూతనంగా మంజూరు చేసిన గురుకులాలు ఎంతో మంది పేద బిడ్డల చదువుకు తోడ్పాటునందిస్తున్నాయన్నారు. ఒకప్పుడు గ్రామాలు ఎలా ఉన్నాయో… ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించి, మంచి చేసిన ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. గతంలో తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారని, ఈసారి కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేసే, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేస్తానని తెలిపారు.
రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దివ్యాంగుల కోసం పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పింఛన్ను రూ.4వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అలాగే, భవిష్యత్లో రూ.6వేలకు కూడా పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం గొప్ప విషయమన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.10వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నారు. రాబోవు కాలంలో ఆ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మన ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చి, సామాజిక ప్రగతికి ఎంతగానో సహకరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణ, రాయిడి రవీందర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, బత్తిని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, మోతె జయపాల్రెడ్డి, జాగృతి దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల కృష్ణమూర్తి, ఎంపీఆర్డీ ఇండియా జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు, మండలాల దివ్యాంగుల సంఘం బాధ్యులు పాల్గొన్నారు.