హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 2 : కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే ఓర్వలేని బీజేపీ, దాని పెంపుడు పార్టీలు పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు. దీక్షా దివస్ 11 రోజుల కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని టౌన్హాల్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్తో కలిసి దాస్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలోని సన్నివేశాలను ప్రదర్శన ద్వారా వీక్షించి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇక్కడ దాస్యం మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమం దేశాన్ని ఆకర్షించడమే కాకుండా యావత్ ప్రజానీకాన్ని సైతం మెప్పించిందన్నారు.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష గాంధేయ మార్గంలో నడిచిందని ఆయన వెంట తెలంగాణ అశేష ప్రజానీకం కలిసివచ్చి రాష్ట్ర సాధనలో భాగమయ్యిందని గుర్తుచేశారు. నవంబర్ 29న కేసీఆర్ దీక్షకు వెళ్తున్న క్రమంలో అరెస్ట్ చేసి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలిస్తున్న తరుణంలో ఓరుగల్లు ఎగిసిపడిందని, అప్పుడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ను, కేటీఆర్ను, అనేక మంది ఉద్యమకారులను జైలుకు పంపారని ఆనాటి సంఘటనలను ఫొటో ప్రదర్శన ద్వారా మరోసారి గుర్తుచేసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రాణవాయువు పోసిందని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ దీక్షా దివస్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్ల పసికూన అని దీనిపై అనేక కుట్రపూరిత పార్టీలు విద్వేషం చిమ్ముతున్నాయన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నదన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలిచిందని దానికి ముఖ్య కారణం కేసీఆర్ అకుంఠిత దీక్షయేనని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ఎకడా లేని విధంగా దీక్షా దివస్ పేరిట 11రోజుల పాటు హనుమకొండలో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మహమ్మద్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు చెన్నం మధు, తదితరులు పాల్గొన్నారు.