చెన్నారావుపేట, ఫిబ్రవరి 21: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈవో వాసంతి సూచించారు. మన ఊరు-మన బడిలో ఎంపికైన మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంగళవారం ఆమె అధికారులు, సర్పంచ్లు, కాంట్రాక్టర్లతో మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో ముందుకెళ్తూ పనులను త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. కాంట్రాక్టర్లు, ఎస్ఎంసీ చైర్మన్లు తమ సమస్యలను డీఈవోకు విన్నవించుకున్నారు. అనంతరం పనులు జరుగుతున్న తీరుపై వాసంతి అధికారులతో చర్చించారు. పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమీక్షలో మండల నోడల్ అధికారి సృజన్తేజ, ఎంపీడీవో భారతి, మండల ఇన్చార్జి స్పెషల్ అధికారి శ్రీనివాసరావు, డీఈ రాజశేఖర్, ఎంపీవో శ్రీధర్రాజు, సర్పంచ్లు కుండె మల్లయ్య, కుమారస్వామి, రమేశ్, లక్ష్మి, భాస్కర్, విజయా బద్దూనాయక్, సుజాతా సారంగం, ఎంపీటీసీలు, ఎమ్మార్సీలు, సీఆర్పీలు పాల్గొన్నారు.
సర్కారు బడుల్లో పనులపై సమీక్ష
వర్ధన్నపేట: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు బడుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు సమీక్షించారు. గ్రామాల వారీగా ఎస్ఎంసీ చైర్మన్లు, అధికారులతో చర్చించారు. కొన్ని పాఠశాలల్లో అనుకున్న మేరకు పనులు ముందుకెళ్లడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి నెల వరకు పూర్తిస్థాయిలో పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఎంఈవో రంగయ్య, ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
నల్లబెల్లి: మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీవో కూచన ప్రకాశ్ ఎస్ఎంసీ సభ్యులను ఆదేశించారు. మండలంలోని ముచ్చింపుల ఎంపీపీఎస్లో జరుగుతున్న పాఠశాల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి సూచనలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోత్ రవళి-రాము, ఉపసర్పంచ్ సురేందర్నాయక్, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.