సూర్యుడు మన నెత్తి మీదే ఉన్నాడా అన్నట్లు వారం పది రోజుల నుంచి ఎండలు భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 46 డిగ్రీలు దాటి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 7నుంచే ‘అగ్ని పరీక్ష’ మొదలవుతుండగా వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీటి శాతం తక్కువై డీహైడ్రేషన్తో పాటు వడదెబ్బ తగిలే ప్రమాదముంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్స తీసుకొని ప్రాణాలు కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
– ములుగు, మే 21 (నమస్తే తెలంగాణ)
వడదెబ్బ తగిలినప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలో తగిన చికిత్స పొందాలి. దవాఖానకు తరలించే క్రమంలో ముందుజాగ్రత్తగా తగిన ప్రాథమిక చికిత్స అందించేందుకు కృషి చేయాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. ఆ తర్వాత చల్లని నీటిలో ముంచిన తడి గుడ్డతో శరీరం మొత్తం తుడవాలి. శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే వరకు అలాగే అనుసరించాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి వడదెబ్బకు గురైన వ్యక్తికి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్రావణం, లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్)ను తాగించాలి. కొన్ని పరిస్థితుల్లో వడదెబ్బ తగిలిన వ్యక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్తే వారికి నీరు తాగించవద్దు. వీలైనంత వరకు త్వరగా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాలి. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తగిన చికిత్స అందిస్తే వడదెబ్బ నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది.