రాష్ట్ర సర్కారు పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో ఒకేరోజు 3.26 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఊరూరా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి జీపీలో వెయ్యి నాటేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో గుంతలు రెడీ చేయించాలని సూచించారు. శనివారం రాయపర్తిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించనుండగా, పర్వతగిరి, కొండాపూర్, కుంటపల్లిలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి పాల్గొననున్నారు.
– వరంగల్, ఆగస్టు 25(నమస్తేతెలంగాణ)
వరంగల్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఒకేరోజు 3.26 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో గుంతలు తవ్వారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగనున్నది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపును పురస్కరించుకుని శనివారం ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వారీగా లక్ష్యం నిర్దేశించింది. దీంతో టార్గెట్ రీచ్ కావడానికి కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలోని అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒకేరోజు జిల్లావ్యాప్తంగా మూడు లక్షలకుపైగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు 3.23 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ప్రతి జీపీ పరిధిలో వెయ్యి మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని జీడబ్ల్యూఎంసీ, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో వెయ్యేసి చొప్పున మూడు చోట్ల మరో మూడు వేల మొక్కలను నాటేందుకు మున్సిపల్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం గుంతలు తవ్వించారు. ఇక ఊరూరా వెయ్యి మొక్కలను నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెయ్యేసి గుంతలను తవ్వించారు. గ్రామాల్లో ఎక్కువ అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్తో పాటు బృహత్ పల్లె, ప్రకృతి వనాల్లో ఈ మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. కొద్ది రోజుల నుంచి కూలీలతో గుంతలు తవ్వించారు. అవెన్యూ ప్లాంటేషన్ కోసం రహదారులకు ఇరు వైపుల, గ్రామాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం శుక్రవారం వరకు ఉద్యమంలా గుంతలను తవ్వించి మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారు. డీఆర్డీవో ఎం సంపత్రావుతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గుంతలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాలు, మున్సిపాలిటీలు, జీడబ్ల్యూఎంసీ పరిధిలో మొత్తం శనివారం ఒకేరోజు 3.26 లక్షల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని నర్సరీలో ఉన్న మొక్కల నుంచి 3.26 లక్షలను నాటేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ ప్రావీణ్య, డీఆర్డీవో సంపత్రావుతో పాటు పలువురు అధికారులతో సమీక్ష జరిపారు.
మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాయపర్తి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. పర్వతగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, నల్లబెల్లి మండలంలోని కొండాపూర్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, సంగెం మండలం కుంటపల్లిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మొక్కలు నాటుతారని తెలిపారు. కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీవో సంపత్రావుతో పాటు వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. నాటిన మొక్కల రక్షణకు జీపీలు, మున్సిపాలిటీలు ట్యాంకర్ల ద్వారా నీరందించాలని అధికారులు ఆదేశించారు. పచ్చదనం మరింత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్లలో అటవీ మొక్కలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో పూలు, పండ్ల మొక్కలను నాటడానికి అధికారులు ప్లాన్ చేశారు.