వరంగల్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య వైభవానికి ప్రతీక అయిన ఓరుగల్లు నుదిటిన ‘కళా’తిలకం దిద్దినట్లుగా ‘కాళోజీ కళాక్షేత్రం’ నిలువబోతున్నది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట చిరస్థాయిలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లతో కడుతున్న ఈ భవనం సాంస్కృతిక కేంద్రానికి చిరునామా కానున్నది. కాళన్న జయంతి అయిన సెప్టెంబర్ 9న కళాక్షేత్రాన్ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. నాలుగు అంతస్థుల సువిశాల భవనం ఆడిటోరియంతో పాటు ఇతర అత్యాధునిక వసతులతో ముస్తాబవుతున్నది.
వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును ఇనుమడింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నది. సెప్టెంబరు 9న కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా దీనిని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్తో ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను వేగవంతం చేయించారు. కరోనా కారణంగా నెలకొన్న ఇబ్బందులతో దాదాపు మూడేండ్ల పాటు పనులు నెమ్మదించాయి. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ సమీక్ష తర్వాత కాళోజీ కళా క్షేత్రం పనులు వేగవంతమయ్యాయి. తెలంగాణ కోసమే తుదిశ్వాస దాకా బతికిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో వరంగల్ నగరంలో కాళోజీ కళా క్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో నిర్మిస్తున్నది. 1500 మంది కూర్చునే సామర్థ్యంతో భవనంలో ఆడిటోరియం, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. హనుమకొండలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మైదానంలోని 4.25 ఎకరాల్లో కళాక్షేత్రం నిర్మితమవుతున్నది. హైదరాబాద్లోని రవీంద్రభారతి కంటే విశాలమైన భవనం, విభిన్నశైలిలో అందుబాటులోకి రానున్నది.
సాంస్కృతిక, కళా వైభవాన్ని కాపాడుకునేలా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంస్కృతిక, కళా వైభవాన్ని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి సందర్భంగా వరంగల్ నగరంలో ‘కాళోజీ కళా క్షేత్రం’ నిర్మించాలని 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి కళా క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. హనుమకొండ బస్టాండ్ సమీపంలో నగరంలోని ప్రధానమైన సెంటర్లో కాళోజీ కళాక్షేత్రాన్ని మొదట రూ.15 కోట్లతో ఎకరంలోనే నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఆ మేరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో వరంగల్కు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కళా క్షేత్రం నిర్మాణంలో మార్పులు చేశారు. నగరంలో ప్రధాన రహదారి పక్కనే 4.25 ఎకరాల్లో నాలుగు అంతస్తులతో కాళోజీ కళా క్షేత్రం నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్ నగరానికి సాంస్కృతిక శోభను పెంచేలా, ఈ నగరం ఒక సాంస్కృతిక కేంద్రంగా స్పష్టమయ్యేలా భవనం డిజైన్ ఉన్నది. నాలుగు అంతస్తుల సువిశాల భవనంలో ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ, లైబ్రరీ, ఆఫీస్, లాబీ, కిచెన్, స్టోర్ రూం నిర్మిస్తున్నారు. 1150 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఆడిటోరియం, మినీ మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, వీఐపీ సూట్స్ను అత్యాధునికంగా కడుతున్నారు.