హనుమకొండ, జూన్ 28: వచ్చే నెల 1న జరుగనున్న గ్రూప్-4 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గ్రూప్-4 పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆమె సూపరింటెండెంట్లు, లైజనింగ్ అధికారులు, రూట్ ఆఫీసర్లుతో సమీక్షించారు. జూలై 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 47,978 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, వీరికోసం 161 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం 32 రూట్లలో 32 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలన్నారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేకాధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
పరీక్షల నిర్వహణకు లైజన్ అధికారులను నియమించామని, వారు చీఫ్ సూపరిటెండెంట్లతోపాటు పరీక్ష కేంద్రంలో ఉండి, సమన్వయంతో పని చేయాలని సూచించారు. టైమ్ ప్రకారం ప్రశ్నపత్రం ఇవ్వాలని, సమయం పూర్తయిన వెంటనే తీసుకోవాలన్నారు. ఎకువ మంది ఉన్న పరీక్ష కేంద్రంలో అదనంగా అసిస్టెంట్ చీఫ్ సుపరింటెండెంట్ను ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సెంటర్లకు సకాలంలో చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అదేవిధంగా సెంటర్ల వద్ద మెడికల్ కిట్, ఓఆర్ఎస్ పాకెట్లతో ఏఎన్ఎం, ఆశ వరర్ను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల సందేహాల నివృతికి టోల్ఫ్రీ నంబర్ 1800-4251115ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఆర్వో ఎం వాసుచంద్ర, అధికారులు పాల్గొన్నారు.
గ్రూప్-4 పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ బాబూనాయక్ తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా నలుమూలల నుంచి అభ్యర్థులు పరీక్ష కేంద్రం వరకు బస్సుల్లో వెళ్లొచ్చని సూచించారు. వరంగల్ బస్టాండ్, కాజీపేట, పెట్రోల్ పంపు, హనుమకొండ బస్టాండ్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు హెల్ప్డెస్క్లో సలహాలు తీసుకుని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కోరారు.