వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనుంది. వరంగల్ జిల్లాలో 3.02 లక్షల ఎకరాల్లో, హనుమకొండ జిల్లాలో 2.42 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు జిల్లాల్లో కలిపి గతేడాది కంటే 1.24 లక్షల ఎకరాలు అదనంగా సాగు చేయనున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగ్రోస్, రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో వీటిని రైతులు నేరుగా కొనుగోలు చేయొచ్చని చెప్పారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసుల సహాయంతో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
– వరంగల్ (నమస్తేతెలంగాణ), హనుమకొండ సబర్బన్, మే 20
వరంగల్, మే 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభు త్వ విధానాలతో వ్యవసాయం పండుగలా మారింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా, అందుబాటు లో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు పథకం ద్వారా ఏటా ప్రతి ఎకరానికి రూ.10 వేల ఆర్థికసాయం, రైతుబీమా వంటి పథకాల అమలుతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం వానకాలం జిల్లాలో పం టల సాగు విస్తీర్ణం 3లక్షల ఎకరాలు దాటనుంది. 2022 వా నకాలంలో 2,80,608 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. ఈ సారి విస్తీర్ణం 3,02,307 ఎకరాలకు చేరనుందని అంచ నా వేశారు. 2023 వానకాలం పంటల సాగు ప్రణాళికను కొద్దిరోజుల క్రితం ప్రభుత్వానికి పంపారు. ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో గతేడాది కంటే సు మారు 22 వేల ఎకరాల్లో అదనంగా పంటల సాగు జరుగనుంది. మండలం వారీగా చెన్నారావుపేటలో 20,948 ఎకరాలు, దుగ్గొండిలో 19,016, ఖానాపురంలో 22,582, నల్లబెల్లిలో 24,328, నర్సంపేటలో 25,180, నెక్కొండలో 32,834, గీసుగొండలో 22,326, ఖిలావరంగల్లో 6,615, పర్వతగిరిలో 26,313, రాయపర్తిలో 41,082, సంగెంలో 32,108, వరంగల్లో 2,328, వర్ధన్నపేటలో 26,647 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేయనున్నా రు. గత ఏడాది చెన్నారావుపేటలో 21,330 ఎకరాలు, దు గ్గొండిలో 18,932, ఖానాపురంలో 21,057, నల్లబెల్లిలో 23,494, నర్సంపేటలో 23,038, నెక్కొండలో 26,651, గీసుగొండలో 21,676, ఖిలావరంగల్లో 7,140, పర్వతగిరిలో 25,340, రాయపర్తిలో 36,196, సంగెంలో 28,372, వరంగల్లో 2,229, వర్ధన్నపేటలో 25,147 ఎకరాల్లో సాగు చేశారు. రాయపర్తి, నెక్కొండ, నర్సంపేట, సంగెం, నల్లబెల్లి, గీసుగొండ, దుగ్గొండి, ఖానాపురం, వర్ధన్నపేట మండలాల్లో ఈ సారి సాగు విస్తీర్ణం పెరుగనుంది.
సాగు ప్రణాళిక ఇది..
సాగు ప్రణాళిక ప్రకారం జిల్లాలో వరి 1,35,712 ఎకరాలు, మక్కజొన్న 13,861, పత్తి 1,30,860, వేరుశనగ 3,036, పెసర 326, కంది 699, సోయాబిన్ 100, పచ్చిరొట్ట 21,000, జొన్న 75, మినుము 25 ఎకరాల్లో రైతులు సాగు చేస్తారు. వీటితో పాటు ఇతర పంటల విస్తీర్ణం కలిపి 3,02,307 ఎకరాలకు చేరనుంది. గతేడాది వరి 1,35,278 ఎకరాలు, మక్కజొన్న 12,324, పత్తి 1,28,201, పచ్చిరొ ట్ట 53, వేరుశనగ 3,509, సోయాబిన్ 77, మినుము 32, పెసర 564, కంది 397 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఈ సారి పత్తి 2,659 ఎకరాలు, కంది 302, మక్కజొన్న 1,537 ఎకరాల్లో అదనంగా సాగు కానుంది. వరి కేవలం 434 ఎకరాలు పెరగనుంది. ఈసారి పచ్చిరొట్టను అదనంగా 20,947 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ, గీసుగొండ, రాయపర్తి, సంగెం మండలాల్లో ఎక్కువగా పచ్చిరొట్ట సాగుకు ప్రోత్సహించాలని నిర్ణయించారు. అత్యధికంగా నెక్కొండ మండలంలో 6వేల ఎకరాలు, నర్సంపేట మండలంలో 3,500, రాయపర్తి, సంగెం మండలాల్లో మూడేసి వేల ఎకరాల్లో సాగుకు ప్లాన్ చేశారు. వేరుశనగ, పెసర, మినుము వంటి పంటల సాగు విస్తీర్ణం కొంత తగ్గనుంది.
కావాల్సిన విత్తనాలు, ఎరువులు..
పంటల సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల కోసం వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. వరి సాగుకు 33,928 క్వింటాళ్లు, మక్కజొన్న సాగుకు 1,108 క్వింటాళ్లు, పత్తి సాగుకు 2,61,720 ప్యాకెట్లు, పప్పు ధాన్యాల పంటల సాగుకు 46, నూనె ఉత్పత్తుల పంటల సాగుకు 2,734 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నివేదికలో తెలిపారు. ఇప్పటికే వ్యవసాయశాఖ కొన్ని పంటల విత్తనాలను సిద్ధం చేసింది. అలాగే జిల్లాకు 1.26 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. సెప్టెంబర్ వరకు యూరియా 48 వేల టన్నులు, డీఏపీ 25 వేలు, ఎంవోపీ 20 వేలు, కాంప్లెక్స్ 28 వేలు, ఎస్ఎస్పీ 5వేల టన్నులు కేటాయించాలని కోరా రు. సీజన్ ప్రారంభం కోసం కొన్ని ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
అందుబాటులో ఎరువులు, విత్తనాలు
హనుమకొండ సబర్బన్ : హనుమకొండ జిల్లాలో ఈ సారి అకాల వర్షాల వల్ల వరి కోతలు ఆలస్యమయ్యాయి. పరకాల డివిజన్ మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వానకాలానికి వ్యవసాయ శాఖ అధికారులు పంట ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సారి గతేడాది కంటే ఎక్కువగా పలు రకాల పంటలు సాగు కానున్నాయి. గత ఏడాది జిల్లాలో మొత్తం 1.4 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవ్వగా, ఈ సారి 2లక్షల 42 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరుగనుంది. ఇందులో 85 వేల ఎకరాల్లో పత్తి సాగవనుండగా, 6 వేల ఎకరాల్లో మక్కజొన్న, 1.5 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయి వరి పంటను రైతులు వేసుకోనున్నారు. మరో వెయ్యి ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 వేల 950 క్వింటాళ్ల పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉంచగా, మరో రెండున్నర లక్షల పత్తితో పాటు ఇతర విత్తనాలను ప్రైవేట్ దుకాణాల్లో అందుబాటులో ఉంచారు. ఇక ఎరువుల విషయానికి వస్తే మార్క్ఫెడ్ వద్ద 575 టన్నుల డీఏపీ, 3800 టన్నుల యూరియా, 200 టన్నుల కాంప్లెక్స్ ఎరువుల నిల్వలు ఉన్నాయి.
పుష్కలంగా ఎరువుల నిల్వలు..
– శ్యాం, డీఎం, మార్క్ఫెడ్
జిల్లాలో వచ్చే వర్షాకాలానికి సంబంధించి ఎరువులకు ఎలాంటి కరువు లేదు. రైతులకు కావాల్సిన ఎరువులన్నీ నిల్వ చేసి ఉంచాం. కాంప్లెక్స్ ఎరువులకు త్వరలో ధరలు తగే అవకాశాలున్నట్లు వ్యాపారుల సమాచారం నేపథ్యంలో కొంత మేరకు మాత్రమే వీటిని నిల్వ చేశాం. యూరియా పూర్తి స్థాయిలో ఉంది. మిగతా వాటికి కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. గతంలో మాదిరిగానే ప్రభుత్వం ఎరువుల విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు.
అందుబాటులో విత్తనాలు ..
– బొందిలి రవీందర్ సింగ్, డీఏవో
వచ్చే వానకాలం సీజన్ మరి కొద్ది రోజుల్లో మొదలవనుంది. పంట ప్రణాళికను సిద్ధం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి పంపించాం. అందుకు తగ్గట్లుగానే అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాం. ఆగ్రోస్, రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో రైతులు నేరుగా కొనుగోలు చేయవచ్చు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. పోలీసుల సహాయంతో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి.