హనుమకొండ చౌరస్తా, జనవరి 8: వందేళ్ల చరిత్ర ఉన్న హనుమకొండలోని మిషన్ హాస్పిటల్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రూ.కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు క్వార్టర్స్లో ఉంటున్న తమను వెళ్లగొట్టారని బాధితులు గనిపాక హేమలత, విజయలక్ష్మి సోమవారం ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మిషన్ హాస్పిటల్లో పనిచేసిన ఉద్యోగులకు అందులోనే ఉండేందుకు క్వార్టర్స్ నిర్మించి ఇవ్వగా, 40 ఏళ్లుగా అందులోనే ఉంటున్నామని చెప్పారు. సేవ చేయడానికి వచ్చి ఆక్రమిస్తున్నారని వారు ఆరోపించారు. క్వార్టర్స్లో ఉంటున్న ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండా ఇంటి సామగ్రి బయటపడేసి, గెంటివేశారని వాపోయారు.
భూములు కబ్జా కాకుండా 2014లో ఎమ్మెల్యే వినయ్భాస్కర్ కాపాడారని, ఇప్పుడు కొంతమంది స్వార్థం కోసం మళ్లీ తమను వెళ్లగొడుతున్నారని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక్కడే పుట్టి, పెరిగామని తమ తల్లిదండ్రులు ఇందులోనే దోబీలుగా పనిచేశారని తమకు ప్రత్యామ్నాయం చూపకుండా అకారణంగా పంపించేసి భూములను లాక్కోవాలని చూస్తున్నారని వారు మండిపడ్డారు. 2014లో చర్చి సభ్యులు మిషన్ హాస్పిటల్ను తీసుకుని ట్రస్ట్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారని, వారికి ఎలాంటి సంబంధం లేకున్నా హాస్పిటల్ను మళ్లీ నడిపిస్తున్నారని, ఇందులో పనిచేసే సివిల్ ఇంజినీర్, డ్రైవర్ దౌర్జన్యం చేస్తూ దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. నర్సుగా ఇక్కడ రూ.9వేలకు పనిచేశామని ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించకుండా ఇక్కడినుంచి వెళ్లిపోవాలని బయటకు గెంటేశారని ఆవేదనతో చెప్పారు.
మిషన్ హాస్పిటల్కు సంబంధించిన ల్యాండ్ ప్రభుత్వ భూమి కాదు. మొత్తం తొమ్మిది ఎకరాలు మిషనరీస్దే. మా దగ్గర పత్రాలు కూడా ఉన్నాయి. శిథిలావస్థలో క్వార్టర్స్ను ఆధునీకరిస్తున్నాం. హాస్పిటల్లో పనిచేసిన ఉద్యోగులు ఎవరూ లేరు. అక్కడినుంచి వెళ్లిపోయారు.