ఇనుగుర్తి, మార్చి 22 : పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల ఎన్నిక కమిటీలను ఈ నెల 15న ఎన్నుకున్నది. ఇందులో భాగంగా ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆ గ్రామ బాలాజీ వీవో అధ్యక్షురాలు రబియాబేగం, ప్రాథమిక పాఠశాలకు ధరణి వీవో అధ్యక్షురాలు బండి సమతను ఎన్నుకున్నారు. ఎన్నికైన రోజునే పాఠశాల అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయుల పేర్లతో బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. కానీ, కొందరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఇప్పటికీ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. ప్రాథమిక పాఠశాలకు ఎంపికైన సమతను హైస్కూల్కు అధ్యక్షురాలిగా మార్చాలని ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిపై కొందరు కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కేసముద్రం ఎంఈవో శ్రీదేవిని ఫోన్లో సంప్రదించగా అమ్మ ఆదర్శ కమిటీలను ఒక్కసారి ఎన్నుకున్నాక మార్చడానికి వీలులేదని తెలిపారు.
అమ్మ ఆదర్శ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారమే ఆయా గ్రామాల వీవో అధ్యక్షురాళ్లను ఎన్నుకున్నారు. మా గ్రామంలో కావాలనే కాంగ్రెస్ నాయకులు పాఠశాలపై రాజకీయం చేస్తూ ప్రధానోపాధ్యాయురాలి ఒత్తిడికి గురి చేస్తున్నారు. హైస్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు రబియా బేగాన్ని మార్చితే ఎంతదూరమైనా వెళ్తాం. డీఈవో, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. ఉన్నతాధికారులు స్పందించి వారితో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయించాలి.