బీఆర్ఎస్ జెండా పండుగ అంబరాన్నంటింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గులాబీ పతాక రెపరెపలాడింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్లీనరీలకు గులాబీ దండు తరలివచ్చింది. సభా స్థలి వరకు ప్రజాప్రతినిధులు, నాయకులు బైక్ ర్యాలీలు తీశారు. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలు, అమరుల స్తూపాల వద్ద నివాళులర్పించిన అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశాలు విజయవంతం కావడంతో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది.
– నమస్తే నెట్వర్క్
ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకొనే ‘గులాబీ జెండా’ను సగ్వరంగా ఎగరేసి, బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా జరుపుకొన్నారు. వాడవాడనా జెండాలు చేతబూని కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణాల్లో సందడి నెలకొంది. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ప్రతినిధుల సభలకు శ్రేణులు ఉద్యమస్ఫూర్తితో దండులా కదిలివచ్చారు. మహిళా నేతలు, కార్యకర్తలు బోనాలు, బతుకమ్మలతో ముందుకుసాగగా, ద్విచక్ర వాహనాల భారీ ర్యాలీలతో వేలాది మంది ఉత్సాహంగా సభా ప్రాంగణాలకు చేరుకున్నారు. ఇలా నియోజకవర్గ ప్లీనరీ ప్రాంగణాలే గాక అటువెళ్లే దారులన్నీ గులాబీమయమయ్యాయి. ఓ వైపు వేదికపై కేసీఆర్ సర్కారు పనితీరును వేనోళ్లా పొగుడుతూ నేతల ప్రసంగాలు.. మరోవైపు శ్రేణుల ‘జై కేసీఆర్’ ‘జై బీఆర్ఎస్’ నినాదాలతో కోలాహలంగా మారింది.
బీఆర్ఎస్ నేతల సమష్టి కృషితో అంతటా ప్లీనరీ సమావేశాలు విజయవంతమయ్యాయి. జనగామ జిల్లా దేవరుప్పులలో జరిగిన పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధుల సభలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని ప్రతిపక్షాలపై నిప్పులుచెరిగి శ్రేణుల్లో నూతనోత్తేజం నింపారు. అంకితభావమే బీఆర్ఎస్ సర్కారు విజయరహస్యమని.. ప్రజాశ్వీరాదమే తమ బలమని పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గ సభలో మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొని వేదికపై నాయకులతో కలిసి నృత్యం చేసి సభికుల్లో ఉత్సాహం నింపారు. సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని కొనియాడారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్నాయక్, టీ రాజయ్య తమ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీల్లో పాల్గొని శ్రేణుల్లో జోష్ నింపారు. మహబూబాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్