ఆత్మకూరు, ఫిబ్రవరి 20 : వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని మినీ మేడారం జాతరలకు సర్వం సిద్ధమైంది. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం 15 రోజుల నుంచి ముందస్తు ప్రణాళికతోనే అన్ని శాఖల అధికారులు, పూజారులు సమన్వయంతో ముమ్మరంగా పనులు చేపట్టారు. మేడారం జాతర తరహాలోనే మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడ్ జాతర బుధవారం నుంచి 24 వరకు కొనసాగనున్నది. గత జాతర కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం అగ్రంపహాడ్ జాతరలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షించారు. అలాగే, రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్డీవో శ్రీనివాస్, పరకాల ఏసీపీ కిశోర్ కుమార్, జాతర కమిటీ చైర్మన్ శీలం రమేశ్, ఈవో శేషగిరి, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, సీఐలు సంతోష్, రవిరాజు, రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ పీ విజయ్చందర్రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, డీఎంహెచ్వో మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నల్లబెల్లి : సమ్మక్క-సారలమ్మ జాతరకు మల్లెపూల గుట్ట మద్ది మేడారం ప్రాంగణం ముస్తాబైంది. తహసీల్దార్ రాజేశ్ పర్యవేక్షణలో సంబంధిత అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జాతరకు 50 వేలకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో రూ.15 లక్షలతో రోడ్ల పునరుద్ధరణ, రూ.7 లక్షలతో తాగునీటి వసతి, మరుగుదొడ్లు, స్నానఘట్టాల నిర్మాణాలు, చేతిపంపుల పునరుద్ధరణ, కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేక చొరవతో రూ.3 లక్షల వ్యయంతో విద్యుత్ ఏర్పాట్లు చేశారు. బుధవారం ఆలయ ప్రధాన పూజారి దురిశెట్టి సమ్మయ్య నేతృత్వంలో కంకవనం తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. అలాగే, సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. గురువారం పూజారి దురిశెట్టి నాగరాజు పోలీస్ బందోబస్తు మధ్య చిలుకలగట్టు నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ఏసీపీ కిరణ్కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై నైనాల నగేశ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ నర్సంపేట డిపో నుంచి మద్ది మేడారం జాతరకు రుద్రగూడెం మీదుగా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. కాగా, నర్సంపేట ఏసీపీ కిరణ్కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. తహసీల్దార్ రాజేశ్, సీఐ శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ రవి, పీఆర్ ఏఈ సత్యనారాయణ, ఏఈఈ పవిత్ర, విద్యుత్ ఏఈ పెద్ది రవళి, ఎస్సై నగేశ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట : జోగంపల్లి జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవార్ల గద్దెలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. రూ.3.50లక్షలతో తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించారు. 1991 నుంచి ఇక్కడ జాతర వైభవంగా జరుగుతోంది. బుధవారం సారలమ్మ, 22న పగిడిద్దరాజు, సమ్మక తల్లి గద్దెలకు చేరనున్నారు. 23న భక్తులకు దర్శనమిస్తారు. పరకాల, హనుమకొండ, కొప్పుల, రాజక్కపల్లి, శాయంపేట చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించనున్నారు. 24న అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. కాగా, జోగంపల్లి జాతరలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంగళవారం తహసీల్దార్ సుభాషిణి ప్రారంభించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను సందర్శించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రంజిత్, జాతర చైర్మన్ అబ్బు ప్రకాశ్రెడ్డి, కోశాధికారి అమ్మ అశోక్, చంద్రారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని కంఠాత్మకూర్, పులిగిల్ల గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మ జాతరను బుధవారం ప్రారంభించనున్నట్లు జాతర కమిటీ తెలిపింది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతరకు వివిధ గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు. భక్తులకు కావాల్సిన తాగునీటి సౌకర్యం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు కమిటీ బాధ్యులు తెలిపారు.