భూపాలపల్లి రూరల్, డిసెంబర్12 : రాష్ట్రంలోని అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలువురు పాస్టర్లకు జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి ఎమ్మెల్యే దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన రాజ్యాం గం ప్రకారం దేశంలోని అన్ని కులాలు, మతాలు, ప్రజలను సమానంగా చూడాలన్నారు. కానీ దేశాన్ని పాలిస్తున్న మతతత్త పార్టీ కేవలం హిందూ మతాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నదని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.
అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పేద ప్రజలకు కానుకలను అందజేస్తూ అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ దేశంలోని అన్ని మతాల వారికి సమాన న్యాయాన్ని కల్పించడానికే బీఆర్ఎస్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 200 మంది పాస్టర్లకు దుస్తులు అందజేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పాస్టర్లు దేవుడి సేవకులైతే, భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు నేను సేవకుడినన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదన్నారు.
దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని, క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. 2.50 లక్షల జనాభా కలిగిన భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తీర్చడానికి ఎమ్మెల్యే గండ్ర ఉన్నారని, మీకు ఏ సమస్య ఎదురైనా వెంటనే అతడికి తెలియజేస్తే తీర్చుతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు కటకం జనార్దన్, సాంబమూర్తి, భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పాస్టర్లు పాల్గొన్నారు.