సుబేదారి,డిసెంబర్ 2 : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ఫలితాల సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఎన్నికల ఫలితాల వెలువడుతున్న సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఎక్కడా ఎవరూ పటాకులు పేల్చడం కానీ, డీజే ర్యాలీలు నిర్వహించడం చేయవద్దని తెలిపారు. గుంపులు, గుంపులగా గుమికూడవద్దని సీపీ సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులు సమన్వయంతో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ హెచ్చరించారు.
ఎనుమాముల మార్కెట్ యార్డ్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓట్ల లెక్కింపు సిబ్బంది, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఏజెంట్లకు సెల్ఫోన్ వినియోగించే అనుమతి లేదని మామునూర్ అసిస్టెంట్ కమిషనర్ సీ సతీశ్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద సెల్ఫోన్ల పెట్టి, కౌటింగ్ హాల్కు వెళ్లాలని ఏసీపీ కోరారు. మీడియా ప్రతినిధులు, కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు ఎనుమాముల మార్కెట్ యార్డ్ మొదటి గేట్ నుంచి మాత్రమే లోపలికి రావాలని సూచించారు. ఆదివారం మార్కెట్లోకి సామాన్య ప్రజలకు అనుమతి లేదని, మొగిలిచెర్ల వైపు వెళ్లేవారు కాశీబుగ్గ 100 ఫీట్ల రోడ్డు నుంచి, నర్సంపేట రోడ్డు నుంచి వెళ్లాలని ఏసీపీ కోరారు.