పీఏసీఎస్ల ఆర్థిక బలోపేతమే లక్ష్యం
రూ.1510 కోట్ల టర్నోవర్.. రూ.9.36 కోట్ల లాభాలు
వానకాలం సీజన్లో 75,600 మంది రైతులకు రుణాలు
డీసీసీబీ మహాజన సభలో చైర్మన్ మార్నేని రవీందర్రావు
సుబేదారి, జూన్ 23 : పట్టా పాస్బుక్ ఉన్న రైతులందరికీ రుణాలు ఇస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టం చేశారు. డీసీసీబీ మహాజన సభ గురువారం హనుమకొండ జిల్లా పరిషత్హాల్లో చైర్మన్ రవీందర్రావు అధ్యక్షతన నిర్వహించారు. గత సంవత్సరంలో పంట, వాణిజ్య రుణాలు, బ్యాంకు పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల నాలుగు నెలల్లో రూ.800 కోట్లు ఉన్న బ్యాంకు టర్నోవర్ను రూ.1510 కోట్ల టర్నోవర్కు తీసుకొచ్చామని తెలిపారు. 2022-23 సంవత్సరంలో రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులకు మెరుగైన సేవలందించడానికి పాలకవర్గం, ఉద్యోగులు కృషి చేస్తున్నట్లు వివరించారు. వానకాలం సీజన్లో 75,600 మంది రైతులకు రూ.493 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టున్నామని చైర్మన్ తెలిపారు. నాబార్డు, రాష్ట్ర సహకార బ్యాంకు సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషిచేస్తున్నట్లు వివరించారు.
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ద్వారా గోదాములు, కోల్డ్స్టోరేజీలు, పెట్రోల్ బంకులు, అగ్రికల్చర్ ఔట్లెట్స్, సూపర్ మార్కెటింగ్ బిజినెస్ కోసం మొదటి విడుత రూ.4 శాతం వడ్డీతో 44 సంఘాలకు రూ.26.10 కోట్ల రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. రెండో విడుత 15 పీఏసీఎస్లకు రూ.9.40 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల విక్రయాలతో పీఏసీఎస్లను బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఈ ఏడాది నుంచి గోల్డ్లోన్ బిజినెస్ చేసుకోవడానికి ప్రతి పీఏసీఎస్కు 4 శాతం వడ్డీతో కోటి రూపాయల రుణం ఇస్తున్నామన్నారు. చిరువ్యాపారులు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, గృహ రుణాలను వాణిజ్య బ్యాంకులకు దీటుగా అందిస్తున్నామని వివరించారు. రుణాల రికవరీ 98 శాతానికి చేరుకుందని, రుణాలు, రికవరీ, బ్యాంకు సేవలు, ఆర్థిక పురోగతిలో సీ గ్రేడ్నుంచి బీ గ్రేడ్లోకి వచ్చాం, జాతీయ స్థాయిలో అవార్డు కూడా తీసుకున్నామని పేర్కొన్నారు. వరంగల్ డీసీసీబీ రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉందని, రూ.9.36 కోట్ల లాభాల్లో ఉన్నామని చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకును మరింత ఆర్థికంగా అభివృద్ధిలోకి తేవడానికి డీసీసీబీ, పీఏసీఎస్ల పాలకవర్గాలు, ఉద్యోగులు సమష్టిగా పనిచేస్తున్నామని చెప్పారు. బ్యాంకు సీఈ వో సీహెచ్ చిన్నారావు, డైరెక్టర్లు కే హరిప్రసాద్, సీహెచ్ మురళీధర్రావు, డీ రమేశ్, ఎం రమేశ్, ఏ జగన్మోహన్రావు, పాలకమండలి సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు, డీఎం బీ శ్రీధర్, ఉద్యోగులు పాల్గొన్నారు.