కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 28: ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా వారిని నిరంతరం అప్రమత్తం చేస్తూ.. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు సూచించారు. జిల్లా ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాల కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ఆయన.. డిజిటల్ పోలీసింగ్కు సంబంధించిన కీలక వ్యవస్థల పనితీరు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సీసీటీఎన్ఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్ పోర్టల్, నాట్గ్రిడ్ వ్యవస్థలను నిర్వహిస్తున్న సిబ్బందితో విడివిడిగా సమావేశమై ఆయా విభాగాల పనితీరు, పెండింగ్ అంశాలు, సాంకేతిక సమస్యలు, డేటా నమోదు, సేవల అమలుపై సమీక్ష జరిపారు. కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, కేసుల సమాచారాన్ని సకాలంలో నమోదు చేయాలని సూచించారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల గుర్తింపు, బ్లాక్ చేయడం, రికవరీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణ స్పందన, బాధితుల డబ్బు రికవరీ, పెండింగ్ కేసులపై దర్యాప్తును వేగవంతంగా చేపట్టాలన్నారు. అవసరమైన కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్-111 అమలు చేయాలని, అధికారులు, సిబ్బంది సాంకేతిక శిక్షణ పొందుతూ సైబర్ నేరాల నియంత్రణలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకతతో కూడిన సేవలు అందించాలని ఆదేశించారు. డీఎస్పీ లింగనబోయిన ఆదినారాయణ, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ సముద్రాల జితేందర్, ఐటీ కోర్ ఎస్సై గణేశ్, పీఆర్వో బొల్లి సాయికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.