ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులు మెరిసిపోతున్నాయి. కార్పొరేట్కు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయి. అదనపు తరగతి గదులు, డ్యూయల్ డెస్క్లు, గ్రీన్చాక్ బోర్డులు, ప్రతి గదిలో నాలుగేసి ఫ్యాన్లు, టాయిలెట్స్ తదితర సౌకర్యాలతో సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఇందులో భాగంగా గీసుగొండ మండలం మొగిలిచర్ల ప్రాథమిక పాఠశాల సకల వసతులతో సిద్ధం కాగా, బుధవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించనున్నారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగేలా అధికారులు స్కూల్ను తీర్చిదిద్దారు. అన్ని హంగులతో కార్పొరేట్ స్థాయికి దీటుగా బడిని మార్చడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబుర పడుతున్నారు.
వరంగల్, జనవరి 31 (నమస్తేతెలంగాణ): మన ఊరు-మన బడి కార్యక్రమంతో గీసుగొండ మండలం మొగిలిచర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ హంగులతో రూపుదిద్దుకుంది. జిల్లాలోని 223 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక కాగా, రూ. 80.93 కోట్ల అంచనాతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ. 24.34 కోట్లతో ఈ పాఠశాలలకు డ్యూయల్ డెస్క్లు, గ్రీన్చాక్ బోర్డులు, ఇతర ఫర్నిచర్ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. రూ. 30 లక్షలలోపు అంచనా వ్యయం గల 164 పాఠశాలల్లో ఎస్ఎంసీల ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ. 30 లక్షలకుపైగా అంచనా వ్యయం గల 55 పాఠశాలల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహణ ద్వారా అభివృద్ధి పనులను అధికారులు చేపడుతున్నారు. పాఠశాలల్లో విద్యుద్దీకరణ, అదనపు గదులు, తాగునీటి అవసరాలు, భోజన శాలలు, ప్రహరీలు, మరుగుదొడ్లు, వంట గదుల నిర్మాణ పనులు వివిధ దశల్లో యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. 35 పాఠశాలల్లో రెడ్కో సహకారంతో సోలార్ ఆన్గ్రిడ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. ఎంపిక చేసిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మండలంలో రెండేసి చొప్పున జిల్లాలోని 13 మండలాల్లో 26 స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా గుర్తించి సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు వేగవంతంగా పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. వీటిలో గీసుగొండ మండలం మొగిలిచర్ల గ్రామంలోని ఎంపీపీఎస్, రాయపర్తి మండలం కొత్తూరులోని ఎంపీపీఎస్, పర్వతగిరి మండలంలోని జడ్పీపీఎస్, ఎంపీపీఎస్, సంగెం మండలం మొండ్రాయి, పల్లారుగూడలోని ఎంపీపీఎస్లు, నల్లబెల్లి మండలం రేలకుంట, నల్లబెల్లిలోని ఎంపీపీఎస్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ముస్తాబైన మొగిలిచర్ల స్కూల్
మొగిలిచర్ల ప్రాథమిక పాఠశాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నారు. కలెక్టర్ బీ గోపితోపాటు అదనపు కలెక్టర్లు, డీఈవో, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా మొగిలిచర్ల ప్రాథమిక పాఠశాలను రూ. 13.25 లక్షలతో అభివృద్ధి చేశారు. మౌలిక వసతులతోపాటు రూ. 49 వేలతో గీన్ చాక్బోర్డు, రూ. 7.83 లక్షలతో డ్యూయల్ డెస్క్ల ఏర్పాటు, పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. సర్కారు బడుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు అందంగా తీర్చిదిద్దడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు సంబుర పడుతున్నారు.