వర్ధన్నపేట, డిసెంబర్ 8 : సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురైన రైతు కుటుంబాల ప్రగతి కోసమే సీఎం కేసీఆర్ ఆరాట పడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలో రూ.కోటితో నిర్మించిన డీసీసీ బ్యాంకు, పీఏసీఎస్ భవనాన్ని ఎంపీ దయాకర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రవీందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలమయిందని తెలిపారు. సాగునీటి వసతిని మెరుగు పరచడంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారని పేర్కొన్నారు. గతంలో పంట రుణాలు చెల్లించేందుకు రైతులు నానా ఇబ్బందులకు గురయ్యేవారన్నారు. ఇప్పుడు రెండు పంటలు పండుతుండడంతో రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారని చెప్పారు. వర్ధన్నపేట ప్రాంత రైతాంగానికి మెరుగైన సేవలందించేందుకు బ్యాంకు భవనాన్ని నిర్మించేందుకు సహకారం అందించిన డీసీసీబీ, నాబార్డుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే అరూరి వర్ధన్నపేటను అభివృద్ధి చేస్తున్నాడన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ, విలీన తండాల అభివృద్ధి కోసం రూ.35 కోట్ల నిధులు మంజూరు చేయించారన్నారు. ప్రస్తుతం పట్టణ రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. జాతీయ రహదారికి ఇరువైపులా అధునాతన డ్రైనేజీ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్తో పాటు అన్ని శాఖలకు సొంత భవనాలు, అంతర్గత రోడ్లతో వర్ధన్నపేట పట్టణ వాతావరణాన్ని సంతరించుకుంటున్నదని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు టర్నోవర్ రూ.1600ల కోట్లకు చేరిందన్నారు.
గతంలో బ్యాంకులో ఆర్థిక లావాదేవీలు తక్కువగా ఉండేవని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న సంస్కరణలు, సంక్షేమ పథకాలతో రుణా ల వసూలు సులువుగా మారిందని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 27 బ్రాంచ్లలో మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థుల విదేశీ చదువుల కోసం రూ.30 లక్ష ల మేర రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. రుణాల మంజూరు, రికవరీలో వర్ధన్నపేట శాఖ మొదటి స్థానం లో నిలిచిందన్నారు. రూ.135 కోట్ల టర్నోవర్ కలిగిన ఈ శాఖకు రూ.కోటి వ్యయంతో భవనాన్ని నిర్మించామన్నారు.
భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించిన మున్సిపాలిటీ, ఎమ్మెల్యే రమేశ్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వర్ధన్నపేట, ఐనవోలు ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, మార్నేని మధుమతి, హనుమకొండ జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరు ణ, డీసీసీబీ సీఈవో చెన్నారావు, డీసీవోలు సంజీవరెడ్డి, నాగేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, వర్ధన్నపేట బ్యాంకు మేనేజర్ శ్రవణ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేశ్, పీఏసీఎస్ సీఈవో వెంక న్న, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, రైతు బంధు సమితి కన్వీనర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.