వరి సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నారు పెంచి నాటు వేసే సంప్రదాయ విధానానికి స్వస్తి పలుకుతూ రైతులు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పొలంలో నేరుగా వరి గింజలను విత్తే పద్ధతిపై వ్యవసాయశాఖ అధికారులు అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, కూలీల ఖర్చు లేకుండా అధిక దిగుబడితో ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చని చెబుతున్నారు. యాసంగి ఇందుకు అనుకూలమని, నీటిని ఆదా చేయొచ్చని, తెగుళ్ల తాకిడి తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఎకరానికి రూ.6వేల వరకు ప్రయోజనం కలుగుతుందని డీఏవో ఉషాదయాళ్ తెలిపారు. దీంతో ఈ పద్ధతిలో సాగు చేసేందుకు అధిక శాతం అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు.
– వరంగల్, డిసెంబర్ 15(నమస్తేతెలంగాణ)
వరంగల్, డిసెంబర్ 15(నమస్తేతెలంగాణ) : యాసంగి పంటల సాగుకు రైతులు సన్నద్ధవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ప్రయోజనాలు కలిగే సాగు పద్ధతులపై విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రధానంగా కొద్ది రోజుల నుంచి దమ్ము చేసిన పొలంలో వరి గింజలను నేరుగా విత్తే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో యాసంగి 76,960 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వానకాలం ధాన్యం విక్రయించిన రైతులు యాసంగి సాగుకు సమాయత్తం అవుతున్నారు. రైతులు ఇన్నాళ్లు వరి నారు మడిని పెంచి పొలంలో నాట్లు వేస్తున్నారు.
వాతావరణ మార్పుల వల్ల సాగునీరు సరైన సమయంలో అందక, వ్యవసాయ కూలీల కొరత, నారు పెంచి నాటు వేయడానికి అధిక రేట్లు, ఇతర పెట్టుబడి ఖర్చు ఎక్కువ కావడం వల్ల సాగు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ క్రమంలో పొలంలో విత్తనాలను విత్తే పద్ధతి సులువైన మార్గమని, అధిక దిగుబడి పొందవచ్చని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారు(ఏఈవో)లు గ్రామాల్లోని రైతువేదికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ మండల అధికారులు, సహాయ సంచాలకు(ఏడీఏ)లు, జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో యాసంగికి అనువైన స్వల్పకాలిక రకాలు మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు.
తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్-15048), జగిత్యాల వరి-1 (జేజీఎల్-24423), కేఎన్ఎం-1638), బతుకమ్మ(జేజీఎల్-18047), కూనారం సన్నాలు (కేఎన్ఎం-118), కాటన్ దొర సన్నాలు (ఎంటీయూ-1010) విత్తనాలను విత్తుకోవాలని చెబుతున్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు వీటిని విత్తుకోవచ్చని, తెలంగాణ సోనా వరి రకాన్ని మాత్రం డిసెంబర్ 10 తర్వాత విత్తుకోవాలని స్పష్టం చేశారు. ఎకరానికి సన్న గింజ రకాలు 8 నుంచి 10 కిలోలు, దొడ్డు గింజ రకాలు 10 నుంచి 12 కిలోలు సరిపోతాయని తెలిపారు. వెదజల్లు పద్ధతిలో ఎకరానికి 10 నుంచి 12 కిలోలు, డ్రమ్ సీడర్ పద్ధతిలో 8 నుంచి 10 కిలోల విత్తనం పడుతుందని రైతులకు సూచిస్తున్నారు.
ఎరువుల వినియోగం..
వరి విత్తనాలను నేరుగా విత్తే పద్ధతిలో భూసార పరీక్ష ఫలితాలు లేదా సిఫారసు ప్రకారం 120 కిలోల యూరియా, 50 కిలోల డీఏపీ, 30 కిలోల ఎంవోపీని ఎకరానికి వేయాలి. మొత్తం భాస్వరం, సగ భాగం పొటాష్ని ఆఖరి దుక్కిలో విత్తనం వేసినపుడు వేయాల్సి ఉంటుంది. యూరియా ఎరువును నాలుగు సమ భాగాలుగా చేసి దుక్కిలో విత్తనం వేసేటప్పుడు, విత్తనం వేసిన 15 రోజులకు ఒకసారి, పిలక దశలో ఒకసారి, చివరగా అంకుర దశలో వేయాలని అవగాహన కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు చెపుతున్నారు.
ఆఖరి దఫా నత్రజని ఎరువుతో పాటు పొటాష్ తప్పనిసరిగా వేయాలని, ఇనుప ధాతు లోపం ఉంటే ఆకులు తెల్లగా పాలిపోయి పంట ఎదుగుదల సరిగా లేనపుడు లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేది, ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపి అవసరాన్ని బట్టి రెండుసార్లు పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. జింకు లోపం పంటలో కనబడినపుడు లీటరు నీటిలో జింకు సల్ఫేట్ 2 గ్రాముల చొప్పున కలిపి ఐదు రోజుల తేడాతో రెండుసార్లు పిచికారీ చేయాలని తెలిపారు.
కలుపు యాజమాన్యం..
విత్తిన 45 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. కలుపు ఉంటే పంట దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. కలుపు నివారణకు ఎకరానికి ప్రేటిలాక్లోర్, సఫెనేర్ (సోఫిట్) 600 మి.లీ లేదా పైరజో లల్ఫురోన్ ఈథైల్ (సాతి) 80-100 గ్రాములు ఇసుకలో కలిపి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల్లోగా చల్లాలని సూచిస్తున్నారు.
విత్తిన 15 నుంచి 20 రోజులకు కలుపు ఉధృతిని బట్టి బిస్ పైరిబ్యాక్ సోడియం 100 నుంచి 120 మిలీ లేదా పెనాక్సులం, సైహలోఫాఫ్ పీ బ్యుటైల్- 800 మి.లీ కలిపి ఉన్న మందును 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ఎకరం పంటలో పిచికారీ చేయాలని తెలిపారు. డ్రమ్ సీడర్ ద్వారా విత్తిన పంటలో యంత్రాలను వాడి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చన్నారు.
ఎకరానికి రూ.6 వేలు ఆదా..
– ఉషాదయాళ్, డీఏవో, వరంగల్
నారుమడి లేకుండా నేరుగా మెట్ట వరి సాగు చేయడం ద్వారా పలు ప్రయోజనాలు ఉంటాయి. కూలీల సమస్యను అధిగమించడం, సరైన సమయంలో పంటను విత్తుకోవడంతో పాటు వాడే విత్తనాల్లో కూడా ఎకరానికి పది కిలోల వరకు ఆదా అవుతుంది. కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. 25 శాతం నుంచి 30 శాతం వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. వారం నుంచి 10 రోజుల ముందుగా పంట కోతకు వస్తుంది. ఇలా వరి విత్తనాలను నేరుగా విత్తుకోవడం ద్వారా ఎకరానికి రూ.6 వేలు ఆదా అవుతుంది. సంప్రదాయ నాటు వేసే పద్ధతి కంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం పొందవచ్చు.