సాగు లెక్క పక్కాగా తేలనుంది. వరంగల్ జిల్లాలో వ్యవసాయ గణన ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ, గణాంక శాఖల అధికారులు గ్రామాలకు వెళ్లి సాగు భూమి విస్తీర్ణం, యజమాని, సామాజిక వర్గం, పంటలు, సాగు నీటి వనరుల వివరాలు సేకరిస్తున్నారు. మూడు దశల్లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించగా, జిల్లాలో మొదటి దశ సర్వే కొనసాగుతున్నది. ఎప్పటికప్పుడు అధికారులు సర్కారు రూపొందించిన ప్రత్యేక యాప్లో వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. వ్యవసాయ గణన పర్యవేక్షణ జిల్లా స్థాయి కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య ఇటీవల కలెక్టరేట్లో సర్వేపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కచ్చితమైన వివరాలతో నిర్ణీత వ్యవధిలో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
– వరంగల్, ఆగస్టు 17(నమస్తేతెలంగాణ
వరంగల్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వ్యవసాయ గణన తొలివిడుత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వ్యవసాయ, గణాంక శాఖల అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. రైతుల నుంచి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్లో పొందుపరుస్తున్నారు. రైతుల జీవన స్థితిగతులు, సాగు కమతాల స్వరూప స్వభావాన్ని తేల్చేందుకు ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి వ్యవసాయ గణన నిర్వహిస్తున్నది. 1970-71 నుంచి ఈ గణన కొనసాగుతున్నది. చివరిసారి 2015-16లో వ్యవసాయ గణన జరిగింది. 2021-22లో నిర్వహించాల్సిన 11 వ్యవసాయ గణన కరోనా వల్ల ఆలస్యమైంది. తాజాగా మూడు దశల్లో ఈ గణన జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యవసాయ గణన పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీని నియమించింది. కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో ముఖ్య ప్రణాళిక అధికారి కన్వీనర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి, నీటి పారుదల అధికారి, లీడ్ బ్యాంకు మేనేజర్ సభ్యులుగా ఉన్నారు. గణాంక, వ్యవసాయశాఖలు సంయుక్తంగా వ్యవసాయ గణన నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేశారు.
జిల్లాలోని వ్యవసాయ శాఖ మండల అధికారులు, మండల ప్రణాళిక గణాంక అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు వ్యవసాయ గణన నిర్వహణపై ఈ నెల 8న పీపీటీ ద్వారా గణాంక శాఖ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. 11 వ్యవసాయ గణన ఉద్దేశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకుని మూడు దశల్లో వ్యవసాయ గణన జరగనుందని చెప్పారు. మొదటి దశలో సెన్సెస్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ సర్వేకు ప్లాన్ చేసినట్లు ఆమె తెలిపారు. వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి ప్రణాళిక, సామాజిక, ఆర్థిక విధాన రూపకల్పనకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కచ్చితమైన వివరాలతో నిర్ణీత వ్యవధిలో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ గణన నిర్వహణపై సూచనలు చేశారు. 9వ తేదీ నుంచి జిల్లాలో వ్యవసాయ గణన ప్రారంభమైంది. తొలి విడుత గణనను ఈ నెల 15 వరకు నిర్వహించాలని అధికారులు మొదట భావించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ నెల 20 వరకు జిల్లాలో వ్యవసాయ గణనను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం వరకు నిర్దేశిత లక్ష్యంలో వ్యవసాయ గణన అరవై శాతం దాటినట్లు అధికారులు వెల్లడించారు.
రెవెన్యూ గ్రామాల వారీగా గణన
జిల్లాలో 186 రెవెన్యూ గ్రామాలు, 59 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం వ్యవసాయ గణన రెవెన్యూ గ్రామాల వారీగా జరుగుతోంది. మండల వ్యవసాయ అధికారులు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. 59 మంది ఏఈవోలు, 26 మంది సూపర్వైజర్లు ఈ గణనలో పాల్గొంటున్నారు. గణన మొదటి దశలో ఆయా రెవెన్యూ గ్రామం పరిధిలోని ఇంటింటికీ వెళ్లి రైతులను కలుస్తున్నారు. క్షేత్రస్థాయిలో కమతాల వారీగా విస్తీర్ణం, భూమి వినియోగం, సాగులో ఉందా ?, యజమాని, సాగుదారు, కౌలుదారు వివరాలు, సామాజిక వర్గాల వారీగా సాగుదారుల లింగ భేదాలు, ఏయే పంటలు పండిస్తున్నారు.. నీటి వినియోగం, సాగు నీటి వనరుల వివరాలను రైతుల ద్వారా సేకరిస్తున్నారు. యాజమాన్యస్థితి అంటే ఉమ్మడిగా లేదా వేర్వేరుగా చేసుకుంటున్నారా ? యజమానులా ? కౌలుదారులా ? అనే సమాచారాన్ని తీసుకుంటున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు.
ఈ సమాచారాన్ని ఏఈవోలు వెంటనే ప్రత్యేక యాప్ ద్వారా సంబంధిత సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. సీపీవో జీ జీవరత్నం, డీఏవో ఉషాదయాళ్ గణాంక వివరాల సేకరణ, సైట్లో అప్లోడ్ చేయడాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నెల 20లోగా మొదటి దశ వ్యవసాయ గణనను పూర్తి చేసే పనిలో అధికారులు తలామునకలయ్యారు. రెండోదశలో ఆయా మండలాల్లో ఎంపిక చేసిన 20 శాతం గ్రామాల్లో కమతాలకు సంబంధించి పంటల వివరాలు.. నీటి పారుదలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. మూడో దశలో ఆయా మండలాల్లో ఎంపిక చేసిన ఏడు శాతం గ్రామాల్లో కమతాల ఇన్ ఫుట్ సర్వేకు సంబంధించిన (ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం, పశు సంపద, వ్యవసాయ పరికరాలు తదితర అంశాలు) సమాచారం సేకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయ గణన సమాచారం అభివృద్ధి ప్రణాళికలు, సాంఘిక, ఆర్థిక విధాన రూపకల్పన, ప్రాధాన్యతల ఏర్పాటు కోసం అనేక స్థాయిల్లో ఉపయోగడనుందని సీపీవో జీవరత్నం తెలిపారు.