కమలాపూర్, మే 13 : కత్తి అవసరం లేకుండానే కొబ్బరిబొండాలు కోసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. వేసవిలో డీహైడ్రేషన్కు గురికాకుండా ఎక్కువగా కొబ్బరి నీళ్లు సేవిస్తుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బరిబొండాలతో వ్యాపారం అన్నికాలాల కంటే ఎండాకాలంలోనే ఎక్కువగా ఉంటుంది. అయితే పదునైన కత్తితోనే కట్ చేసే క్రమంలో ఒక్కోసారి చేతిలో నుంచి జారిపోవడమో, లేకపోతే గాయం కావడమో జరుగుతుంటుంది. అంతేగాక కటింగ్ చేసే నేర్పు కావాలి.
కానీ కమలాపూర్కు చెందిన తుమ్మ హరి ఎలాంటి శ్రమ లేకుండా సులువుగా కొబ్బరిబొండాలు కట్ చేసేందుకు కోకో ఎక్స్ప్రెస్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. ఈ మెషీన్తో కోసే పనిలేకుండా సులువుగా కాయలకు రంధ్రం చేయవచ్చు. నార్మల్, కూల్ కొబ్బరినీళ్లు అందించే సౌకర్యం ఉంది. అలాగే ఈ యంత్రంలో 100నుంచి 200 బొండాలు నిల్వ చేసుకునేందుకు బాక్స్తో పాటు ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు అనువుగా నాలుగు చక్రాలు కూడా ఉన్నాయి. చిరు వ్యాపారి నీడనిచ్చేలా గొడుగు సౌకర్యం ఉంది. ఒక్కో కొబ్బరిబొండానికి రూ.30, నీళ్లకు లీటర్ రూ.110, అరలీటర్కు రూ.60కి విక్రయిస్తున్నట్లు హరి తెలిపారు.
సమయం ఆదా అవుతుంది..
– తుమ్మ హరి, చిరు వ్యాపారి, కమలాపూర్
కొత్తగా వచ్చిన మెషీన్ వల్ల సమయం ఆదా కావడంతో పాటు పని తొందరగా అవుతుంది. కొబ్బరిబొండా కటింగ్ చేయాలంటే పదునైన బరువున్న కత్తి పట్టుకోవాలి. ఈ వ్యాపారం చేయాలంటే మగ మనిషి తప్పనిసరి ఉండాలి. కోకో ఎక్స్ప్రెస్ యంత్రంతో ఆడవాళ్లు సైతం ఎలాంటి ప్రమాదం లేకుండా సులువుగా కొబ్బరిబొండాకు రంధ్రం చేయవచ్చు. కోకో ఎక్స్ప్రెస్ యంత్రం జిల్లాలోనే కమలాపూర్ బస్టాండ్లో మూడో యంత్రంగా వినియోగంలో ఉంది.