మరిపెడ, జూలై 11: మరిపెడ పురపాలక సంఘం పరిధిలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణంలోని 9వార్డు లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ ల వివరాలను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను తనిఖీ చేశారు, సాధారణ ప్రసవలను ప్రోత్సహించాలని, మాత శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని తొమ్మిదవ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.
మరింత వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుందని ప్రభుత్వ సూచించిన దశలవారీగా నిర్మాణం పూర్తి అయిన ఇండ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి బిల్లులు త్వరగా పడే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, హెల్త్ సబ్ సెంటర్స్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం ఉన్నచోట వైద్య పరీక్షల క్యాంపు నిర్వహించాలని, ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
గ్రామపంచాయతీలు, మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాలలో పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహిస్తూ షెడ్యూల్ ప్రకారం శానిటేషన్ నిర్వహించాలన్నారు. అన్ని వసతి గృహాలలో చదువుతున్న పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ముందస్తుగా తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ కృష్ణవేణి, హౌసింగ్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు ఉన్నారు.