గంగమ్మ ఉప్పొంగుతున్నది. ఒకప్పుడు పాతాళంలోకి అడుగంటిన జలాలు నేడు ఉబికి వస్తున్నాయి. 300 ఫీట్లలోతు వరకు బోరు వేస్తేనే నీరొచ్చే పరిస్థితి. కానీ నేడు 6.20 మీటర్ల లోతులోనే జీవధార ఉంది. దుర్భిక్ష ప్రాంతంగా మారిన జిల్లాలో నేడు పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చాక దేవాదుల ఎత్తిపోతల పథకంలో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించింది. యశ్వంతాపూర్, కోలుకొండ వాగులపై తొమ్మిది చోట్ల చెక్డ్యాములు కట్టించింది. దీంతో ఈ వానకాలంలో కిలోమీటర్ల కొద్ది బ్యాక్ వాటర్ నిలిచింది. మరోవైపు ఎండాకాలంలోనూ గోదావరి జలాలతో చెరువులు నింపుతున్నారు. వర్షాలు సైతం సమృద్ధిగా కురుస్తుండడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.
జనగామ, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు కరువుకు కేరాఫ్గా జిల్లాలో నేడు జలధార ఉప్పొంగుతున్నది. అడుగంటిన జలాలు.. నెర్రెలు బారిన భూములు.. బిందెడు నీళ్లు దొరకని ప్రాంతాల్లో గంగమ్మ పొంగిపొర్లుతోంది. ఉప్పొంగి వస్తున్న భూగర్భజలాలతో సాగు రెట్టింపైంది. రెండు పసర్లు(కొన్నిచోట్ల మూడో పంట) కూడా పలుచోట్ల సాగవుతున్నది. తెలంగాణ సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల కరంటు, దేవాదుల జలాలతో పంటల సాగు పెరిగింది. మరోవైపు వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో చెరువులు నిండాయి. వాగులు, వంకల ద్వారా జలాశయాల్లోకి చేరుతున్న నీటితో అంచనాలకు మించి దిగుబడి వస్తుండడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. భూగర్భ జలాల లెక్కింపు కోసం జిల్లాలో 24 ప్రాంతాల్లో ఫీజోమీటర్లు, 5 చోట్ల ఆటోమెటిక్ వైడర్ మీటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా శాస్త్రీయంగా భూగర్భజలాల పెరుగుదల, తరుగుదలను లెక్కిస్తున్నారు. రెండేళ్ల క్రితం 9.58 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు.. గత ఏడాది 3.38 మీటర్లకు చేరితే ఈసారి 3.30 మీటర్లకు ఉబికి వచ్చింది. ఒకప్పుడు వ్యవసాయ భూములు, నివాస గృహాల్లో బోర్లు, బావులు వేయాలన్నా.. తవ్వాలన్నా 200 నుంచి 300 ఫీట్ల లోతు వరకు వెళ్లినా నీటి జాడ కనిపించని పరిస్థితి నుంచి నేడు 30 నుంచి 80 ఫీట్ల లోపే గంగమ్మ ఉబికి వస్తోంది. దీంతో ఎండిపోయిన బావులు, బోర్లు వినియోగంలోకి వస్తున్నాయి. జిల్లాలో మరో మూడేళ్ల వరకు సాగు, తాగునీటికి ఢోకా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరిగిన భూగర్భ జలాలతో రికార్డు స్థాయిలో పంటలు సాగవుతుండడంతో జిల్లాలో ఎటుచూసినా ఆకుపచ్చని వాతావరణం కనిపిస్తున్నది.
దేవాదులతో పంటలు సస్యశ్యామలం..
దేవాదుల రూపంలో వచ్చిన సరికొత్త మార్పుతో వ్యవసాయం పండుగలా మారింది. ప్రభుత్వరంగ సంస్థలు రైతుల నుంచి 2017-18 యాసంగిలో 74,523 మెట్రిక్ టన్నులు సేకరిస్తే, 2018-19లో 70,142, 2019-20లో 1,79,000, 2020-21 సంవత్సరంలో ఏకంగా 2,44,414కు పెరిగింది. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తో పంటల సాగుకు అనుకూలంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారంతో వన సంపద వృద్ధి చెందుతున్న ఫలితంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీనికి తోడు గోదావరి జలాల రాకతో జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండల్లా తొణకిసలాడుతున్నాయి.
వినియోగంలోకి వస్తున్న బోర్లు..
గృహ నిర్మాణాలు సహా వ్యవసాయ భూముల్లో గతంలో బోర్లు వేసుకోవాలంటే 200 నుంచి 300 ఫీట్ల లోతు వరకు డ్రిల్లింగ్ వేసినా నీటి జాడలు కనిపించని పరిస్థితి నుంచి నేడు 30 నుంచి 80 ఫీట్ల లోపే గంగమ్మ ఉబుకివస్తున్నది. ఫలితంగా ఎండిపోయిన బోరు బావులు సైతం వినియోగంలోకి వస్తున్నాయి. వానకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 3.78 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా రైతులు వరి, పత్తి, ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. దీంతో నేలపై రాలుతున్న ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టే దిశగా అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించే విధంగా పనులు పెద్దఎత్తున చేపడుతున్నారు. ఇందులో భాగంగానే రైతుల పంటల పొలాల్లో నీటి కుంట (ఫాంపాండ్) నిర్మాణ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. రైతుల ఆసక్తిని బట్టి 2 మీటర్ల పొడువు, వెడల్పుతోపాటు 20 మీటర్ల పొడవు, వెడల్పు వరకు తవ్విస్తున్నారు. మొత్తం ఐదు రకాలుగా కుంటల్ని తవ్వుతున్నారు. గత ఏడాది జిల్లాలో ఫాంపాండ్ నిర్మాణ లక్ష్యం 2వేలు అయితే అంతకుమించి 2,900 కుంటలు పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లాకు అగ్రస్థానం దక్కింది. ఈఏడాది 3,750 సేద్యపు కుంటల నిర్మాణం పనులు చేపడితే వాటిపై చేస్తున్న ఖర్చులో కూడా జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలవడం విశేషం. జిల్లా వ్యాపితంగా 2లక్షల 55వేల 7 రన్నింగ్ మీటర్ల కాంటూరు కందకాలు మంజూరైతే 62,449 రన్నింగ్ మీటర్ల కందకాలు పూర్తిచేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే జనగామ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, జలం వృథా అరికట్టడం, నీటి వనరులను పరిరక్షించుకోవడం వంటి అంశాలను ప్రతి ఊరికి చేరేవేసేందుకు జిల్లాలోని అన్ని గ్రామాలకు కళాజాత బృందాలు ప్రచారం చేశాయి. ఇంటింటికీ కరపత్రాల పంపిణీ, వాల్పోస్టర్లు అతికించడం, కూడళ్లలో ఫ్లెక్సీలు కట్టడం వంటి కార్యక్రమాలతో చైతన్యం కలిగించేందుకు కార్యాచరణ చేపట్టారు.