సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు ఆ యువ రైతు. తనకున్న పొలంలో ఆర్గానిక్ పద్ధతిలో వివిధ రకాల పంటలను పండిస్తూ సిరులు పండిస్తున్నాడు. కొత్తిమీర, బెండ కాయ, వంకాయ, చిక్కుడు, టమాట, బీరకాయ, సోరకాయ, మునగ, మిరప, అలిచింత కాయ.. తదితర కూరగాయలను సాగు చేస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలిస్తున్నాడు మహదేవపూర్కు చెందిన పెండ్యాల ప్రవీణ్.
మండల కేంద్రానికి చెందిన పెండ్యాల ప్రవీణ్ గతంలో వరి సాగు చేసేది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సేంద్రియ విధానంతో సాగు చేసి తనతో పాటు పలువురికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కూరగాయల పంటలను సాగు చేస్తున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలో కొత్తిమీర, బెండకాయ, వంకాయ, చిక్కుడు, టమాట, బీరకాయ, సోరకాయ, మునగ, మిరప, అలిచింత కాయ.. తదితర కూరగాయలు సాగు చేస్తూ లోకల్ మార్కెట్కు తరలించి లాభాలు పొందుతున్నాడు.
ఐటీఐ పూర్తి చేసిన ప్రవీణ్ గతంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శానిటరీ షాప్ నడిపి నష్టాల పాలయ్యాడు. ఇక్కడి రైతులందరూ మిర్చి, పత్తి, వరి మాత్రమే సాగు చేస్తున్నారని, వినూత్నంగా ఆలోచించి కూరగాయల సాగు చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే అందులో ప్రత్యేకంగా శిక్షణ తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ విధానంపై మెళకువలకు నేర్చుకున్నాడు. తన పొలంలో పలు రకాల కూరగాయల పంటలను సాగు చేసి లోకల్ మార్కెట్లో హోల్సేల్గా విక్రయిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో ఖర్చు అధికమైనప్పటికి మంచి డిమాండ్ ఉండడంతో అటు వైపే మొగ్గు చూపాడు. మూడెకరాల్లో కూరగాయల సాగు కోసం సొంతంగా డ్రిప్, కలుపు నివారణకు మల్చింగ్, పురుగుల నియంత్రణకు సోలార్ ట్రాప్లను అమర్చాడు. ఎకరానికి రూ. లక్ష చొప్పున ఖర్చవుతుండగా సంవత్సరం పొడగునా సీజన్కు తగినట్లు పంటలను సాగు చేస్తు లాభాలను పొందుతున్నానని, భవిష్యత్లో దీన్ని మరింత విస్తృతం చేసి మరికొంత మందికి ఉపాధి కల్పిస్తానని ప్రవీణ్ పేర్కొన్నాడు.