నెక్కొండ, ఫిబ్రవరి 2: ఆడుకుంటూ వెళ్లి చేదబావిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో జరిగింది. ఎస్సై జానీబాషా కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన నోవెల్ బాగెల్-రజిని బాగెల్ దంపతులు బతుకుదెరువు కోసం ఆరునెలల క్రితం నెక్కొండకు వచ్చి పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండేళ్ల కుమారుడు కార్తీక్ శుక్రవారం ఉదయం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చేదబావిలో పడిపోయాడు. గమనించిన అతడి తల్లి కేకలు వేయడంతో తండ్రి నోవెల్ తాడు సాయంతో చేదబావిలోకి దిగాడు. అయితే, కార్తీక్ అప్పటికే నీటిలో పూర్తిగా మునిగి అడుగంటాడు.
సమాచారం అందుకున్న ఎస్సై ప్రమాదస్థలిని పరిశీలించి గ్రామస్తుల సహకారంతో శవాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో నర్సంపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. సిబ్బంది కె.లక్ష్మీప్రసాద్, జయరాం, మధుసూదన్, సాంబయ్య వచ్చి పాతాళగరిగె సాయంతో శవాన్ని వెలికితీశారు. కాగా, చేదబావిపై రేకులు ఏర్పాటు చేసినా అవి పటిష్టంగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కళ్లెదుటే కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు కలచివేశాయి.