కాశీబుగ్గ, జనవరి 24: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం రికార్డు స్థాయిలో 27,200 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్లో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి రోజుకు రెండు వేల నుంచి 10 వేల వరకు బస్తాలు వచ్చాయి. సంక్రాంతి పండుగ తర్వాత బస్తాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది.
ఈ నెల 19న అత్యధికంగా 25 వేలు, సోమవారం, మంగళవారం 20 వేలకు పైగా బస్తాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో అడ్తి, ఖరీదు వ్యాపారులతోపాటు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మార్కెట్కు లక్షా 13 వేల క్వింటాళ్ల మిర్చి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. తేజ రకం క్వింటాల్కు రూ. 20,200, వండర్హాట్ రూ. 19 వేలు, యూఎస్ 341 రూ. 16,800, తాలు రకం రూ. 8700 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
ఎనుమాముల మార్కెట్కు మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి సంగయ్య తెలిపారు. శుక్రవా రం గణతంత్ర దినోత్సవం, శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం వారాంతపు సెలవు. 27న సీసీఐ కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని, 29 నుంచి మార్కెట్లో క్రయవి క్రయాలు పునఃప్రారంభం అవుతాయని వెల్లడించారు.