జనగామ రూరల్, జనవరి 10: మండలంలోని పసరమడ్ల శివారు చంపక్ హిల్స్లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు 24గంటల్లో 35 మందికి డెలివరీలు చేశారు. 20మంది మగ శిశువులు, 15మంది ఆడపిల్లలు జన్మించారు. 14 నార్మల్, 21 సిజేరియన్ చేశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఎంసీహెచ్ సూపరింటెండెంట్ సుగుణాకర్రాజు తెలిపారు. దవాఖానలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్లు శోభ, మనస్విని కలిసి ఈ డెలివరీలు చేశారు. దీంతో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ప్రథమంగా డెలివరీలు చేసినట్లు తెలిపారు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ట్విట్టర్ ద్వారా డాక్టర్ల బృందానికి అభినందనలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, కలెక్టర్ శివలింగయ్య కూడా అభినందనలు తెలిపారు. డాక్టర్లు వెంకటేశ్వర్లు, శంకర్, ఉపేందర్, ఆయాలు సోఫియా, లావణ్య, వినయ్ కిశోర్, కల్పన పాల్గొన్నారు.