కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో సర్కారు బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టగా, బడుల ఆధునీకరణతో పాటు మౌలిక వసతులు వేగంగా సమకూరుతున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో తొలి విడుత 1,165 స్కూళ్లను ఎంపిక చేసి రూ.250 కోట్లు మంజూరు చేసింది. వీటితో ప్రహరీ, అదనపు తరగతి గదులు, విశాలమైన డైనింగ్ హాళ్లు, కిచెన్ షెడ్లు, తలతలా మెరిసే టైల్స్తో వాషింగ్ ఏరియా, టాయిలెట్లు వంటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే ఫర్నిచర్, తీరొక్క రంగులతో వేసిన పెయింటింగ్తో పాఠశాల గోడలు, ఆవరణలు అందంగా మెరిసిపోతున్నాయి. పలుచోట్ల ఇప్పటికే వంద శాతం పనులు పూర్తికాగా.. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు తీరి విద్యాలయాలు నయాలుక్తో ఆకట్టుకుంటున్నాయి.
వరంగల్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు-మన బడి’ నిధులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. తొలి విడుత ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.30 లక్షలలోపు విలువైన పనులు ఎస్ఎంసీల ద్వారా చేపట్టగా, దాదాపు చివరి దశకు చేరాయి. కొన్నింటిలో వంద శాతం పూర్తి కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నూరు శాతం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పనిచేస్తున్నారు. టాయిలెట్లు, మంచి నీరు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, కూర్చునేందుకు బెంచీలు, భవనాలకు రంగులు, డిజిటల్ బోర్డులు, గ్రీన్ చాక్బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కోసం వంట గదులు నిర్మించడంతోపాటు విద్యార్థులు ఆడుకునేందుకు గ్రౌండ్స్కు మెరుగులు దిద్దుతున్నారు. వివిధ అభివృద్ధి పనులతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తయారవుతున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లి దండ్రులు మురిసిపోతున్నారు.
వరంగల్ జిల్లాలో..
జిల్లాలో తొలి విడుత సెలెక్ట్ చేసిన 223 పాఠశాలలకు ప్రభుత్వం సుమారు రూ.58 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది. వీటిలో రూ. 30 లక్షల లోపు పనులు చేపట్టిన 163 పాఠశాలల్లో అభివృద్ధి పనులు స్పీడ్గా సాగుతున్నాయి. అభివృద్ధి పనులు చేసే ఏజెన్సీలకు ప్రభుత్వం ఇప్పటికే అడ్వాన్సుగా రివాల్వింగ్ ఫండ్ నుంచి రూ.4.08 కోట్లు చెల్లించింది. పలు పాఠశాలల్లో జరిగిన వివిధ అభివృద్ది పనులు చేసిన ఏజెన్సీలకు ఎంబీ రికార్డు చేయడం ద్వారా అధికారులు రూ.1.42 కోట్లు చెల్లించారు. 163 పాఠశాలల్లో దాదాపు తొమ్మిది స్కూళ్లలో పెయింటింగ్ సహా వంద శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగతా 146 స్కూళ్లలో 60 నుంచి 80 శాతం పనులు జరిగాయి. 59 పాఠశాలల్లోని రూ.30 లక్షలకు పైగా విలువ చేసే పనులను కాంట్రాక్టర్లతో చేయించేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. పనులు మొదలవగా, పూర్తి చేయాల్సిన గడువు సమీపిస్తుండడంతో వేగవంతం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ కింద తొలి విడుత 149 పాఠశాలలను ఎంపిక చేశా రు. మౌలిక వసతులు, ఆధునీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభ్వుం రూ.41.30 కోట్లు మంజూరు చేసింది. వీటితో అవసరమైన చోట అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్స్, కంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు, వంట గదుల నిర్మాణంతో పాటు విద్యుద్దీకరణ, తాగునీటి వసతి, బ్లాక్బోర్డులు, ఫర్నిచర్, పెయింటింగ్, డిజిటల్ విద్య సహా చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారు. కాగా 33 పాఠశాలల్లో మొత్తం పనులు పూర్తయ్యాయి. మిగతా చోట్ల 50శాతం పైగా పూర్తయ్యాయని ఏఎంవో లక్ష్మణ్ తెలిపారు.
మహబూబాబాద్లో..
జిల్లావ్యాప్తంగా 316 పాఠశాలలు మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమానికి ఎంపికయ్యాయి. ఇందులో ప్రాథమిక-198, ప్రాథమికోన్నత- 42, జడ్పీ ఉన్నత పాఠశాలలు-76 ఉన్నాయి. ఈ పాఠశాలల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చేసింది. వీటిల్లో పనులు జోరుగా సాగుతున్నాయి. అదనపు గదులు, డైనింగ్హాల్ నిర్మాణం, ప్రహరీ, విద్యుత్, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వంటశాల తదితర పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. కొద్ది రోజుల్లో పెయింటింగ్ పనులు కూడా పూర్తయి పాఠశాలలు అద్దంలా మెరువనున్నాయి.
హనుమకొండలో..
జిల్లాలో మన ఊరు-మన బడి’ కింద 176 పాఠశాలలను ఎంపిక చేయగా, ఇందులో 84 ప్రైమరీ, 74 హైస్కూల్స్, 18 యూపీఎస్లు ఉన్నాయి. రూ. 30 లక్షల బడ్జెట్ కన్న ఎక్కువగా ఉన్న 42 స్కూళ్లను టెండర్ కాల్ కోసం వదిలిపెట్టారు. మిగతా 133 పాఠశాలల్లో ఎస్ ఎంసీలతో పనులను మొదలుపెట్టేందుకు శ్రీకారం చుట్టగా, అందులో పది కమిటీలు ముందుకు రాలేదు. దీంతో మిగతా 123 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. ముందుగానే అంచనా వ్యయంలో 15 శాతం నిధులు ఎస్ఎంసీ, ప్రధానో పాధ్యాయుడి జాయింట్ అకౌంట్లో జమ చేసి పనులను వేగవంతం చేశా రు. 175 పాఠశాలల్లో జరగాల్సిన అభివృద్ధి పనులకు రూ. 65 కోట్లు అంచనా వేయగా, పూర్తయిన పనులకు ఆయా పాఠశాలల ఎస్ఎంసీ, హెచ్ఎం జాయింట్ అకౌంట్లోకి రూ.3.30 కోట్లు జమ చేశారు.
సంబురపడుతున్న తల్లిదండ్రులు
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహా సౌకర్యాలు, ఇంగ్లిష్ మీడియంలో బోధన చేస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులు సంబురపడుతున్నారు. విశాలమైన తరగతి గదులు, ఆటస్థలాలు, తదితర మౌలిక వసతులతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినందుకు గర్వంగా ఫీలవుతున్నారు. తాము చదువుకునే రోజుల్లో ఇలాంటి సదుపాయాలు లేవని, తమ పిల్లలు చాలా అదృష్టవంతులంటున్నారు. సర్కారు బడులను అభివృద్ధి చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి రావడం గర్వించ దగ్గ విషయమని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటుండడం విశేషం.
ములుగులో..
జిల్లాలో తొలి విడుత ఎంపికైన 125 పాఠశాలలకు ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులు శరవేగంగా కొనసాగగా, ప్రస్తుతం 80శాతం మేర పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల 50-60 శాతం పనులు పూర్తి కావొచ్చాయి. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి ప్రభుత్వ పాఠశాలను మోడల్ పాఠశాలగా ఎంపిక చేసి పనులను దాదాపు పూర్తి చేశారు. నెలాఖరు వరకు పూర్తి చేసేలా అధికారులు ముందుకు పోతున్నారు. నూతన సంవత్సరానికి అంతా సిద్ధం చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయి.
విశాలమైన డైనింగ్ ఏరియా..
ఒకప్పుడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మధ్యాహ్న భోజనం వండేందుకు తంటాలు పడేవారు. సరైన వసతులు లేక విద్యార్థులు భోజనం చేయాలన్నా ఇబ్బందులుండేవి. ఇప్పుడలాంటి సమస్యలన్నీ కనుమరుగు కానున్నాయి. ‘మన ఊరు-మనబడి’ కింద కేసీఆర్ సర్కారు కావాల్సినన్ని నిధులు మంజూరు చేస్తుండడంతో విశాలమైన డైనింగ్ హాల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. తలతలా మెరిసే టైల్స్తో వాషింగ్ ఏరియా, టాయిలెట్స్ సహా పాఠశాల ఆవరణ మొత్తం సకల సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా మెరిసిపోతున్నది.
పర్వతగిరి పాఠశాలకు కార్పొరేట్ కల
పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా మెరిసిపోతున్నాయి. ‘మన ఊరు-మనబడి’ కింద వంద శాతం పనులు పూర్తయిన వాటిలో ఈ స్కూళ్లు ఉన్నాయి. ఒకే ప్రాంగణంలో ఉన్న ఈ పాఠశాలల్లో హైస్కూలుకు రూ.14 లక్షలు, ప్రైమరీ స్కూల్కు రూ.4 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో విద్యుద్దీకరణ, పెయింటింగ్ పనులు వంద శాతం పూర్తి కావడంతో కార్పొరేట్ను తలపిస్తోంది. ఇలా మోడల్గా మండలానికో రెండు పాఠశాలల్లో అభివృద్ధి పనులన్నింటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనే ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
జనగామలో..
జిల్లాలో ‘మన ఊరు-మనబడి’లో భాగంగా తొలి విడుతలో 176 పాఠశాలలు ఎంపిక కాగా, వీటి అభివృద్ధికి రూ.37,83,61,867 ఖర్చు చేస్తున్నారు. 100 ప్రాథమిక, 19 ప్రాథమికోన్నత, 57 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.30 లక్షలలోపు పనులు చేపట్టే 131 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడడం, ఫర్నిచర్ సమకూర్చి అందంగా పెయింటింగ్ వేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కోసం వంట గదులు, పాఠశాలల్లో గ్రీనరీ పెంచడంతో పాటు ఆటస్థలాలను అభివృద్ధి చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తర్వాత చేతులు శుభ్రం చేసుకునేందుకు నల్లాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి గదిలో ఫ్యాన్లు.. డెస్క్లు
మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా తొలి విడుత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాలో సెలెక్ట్ చేసిన స్కూళ్లలో వరంగల్ మట్టెవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి. శిశు నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతున్న ఈ స్కూలులో విద్యార్థుల సంఖ్య 400కుపైగా ఉంది. అన్ని కలిపి పన్నెండు గదులు ఉన్నాయి. వీటిలో ఇన్నాళ్లు గదికో ఫ్యాన్ ఉంది. వాష్రూముల వద్ద గల ట్యాప్లు దెబ్బతిన్నాయి. అరకొర నీటి సరఫరా, శానిటేషన్ కొరవడింది. కిచెన్ గది లేదు. మరమ్మతులు లేకపోవడంతో కొన్ని గదులు శిథిలావస్థకు చేరాయి. ఈ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు బడులను కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో తీర్చిదిద్దేందుకు మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో మట్టెవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు స్థానం దక్కింది.
స్కూల్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం సుమారు రూ.30 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఎస్ఎంసీ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు తుది దశకు చేరాయి. ఒక్కో గదిలో రెండు నుంచి నాలుగు ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్లైట్లు ఏర్పాటు చేశారు. పాఠశాల మొత్తం విద్యుద్దీకరణ చేశారు. వాష్రూములు, హ్యాండ్వాష్ వద్ద కొత్త ట్యాప్లను అమర్చారు. శానిటేషన్, నీటి సరఫరా పనులను పూర్తి చేశారు. ప్రతి గదిలో విద్యార్థుల కోసం డెస్కులతో పాటు బ్లాక్బోర్డు ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. కొన్ని గదుల్లో ప్లాస్టరింగ్ పనులు చేసి టైల్స్ వేసే పనులు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. వంట కోసం కిచెన్ గది నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో పెయింటింగ్ పనులు చేపట్టేందుకు ఎస్ఎంసీ సన్నద్ధమవుతుండగా అభివృద్ధి పనులతో ఈ స్కూలు రూపురేఖలు మారిపోతున్నాయి.