నర్సంపేట, ఏప్రిల్ 7: జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట నియోజకవర్గం నుంచి నేడు ఉత్తర యుద్ధం ప్రారంభం కానుంది. రైతులతో రెండు లక్షల పోస్టుకార్డుల ద్వారా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి సందేశాన్ని పంపించి నిరసన వ్యక్తం చేయనున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దుగ్గొండి మండలం మహమ్మదాపురంలో తొలి కార్డును పోస్ట్బాక్స్లో వేసి ప్రారంభించనున్నారు.
ఈ మేరకు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అదే సమయంలో ఉత్తర యుద్ధం ప్రారంభం కానుంది. నల్లబెల్లి మండలంలోని మూడుచెక్కలపల్లి, నర్సంపేట మండలంలో రాజపల్లి, ఖానాపురం మండలం బుధరావుపేట, చెన్నారావుపేట మండలం పాపయ్యపేట, నెక్కొండ మండలం పెద్దకోర్పోల్లో మండల, గ్రామస్థాయి నాయకులు, రైతులు పాల్గొని ఉత్తరాలను పోస్ట్ చేయనున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పోస్ట్కార్డులను పంపించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్డులపై సందేశాన్ని ఇప్పటికే అచ్చు వేయించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్తర యుద్ధంలో పాల్గొని విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
గౌరవనీయులైన కేంద్రమంత్రి కి..
జాతీయ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి రూ. 30 వేల కోట్ల నిధులను తగ్గించడంతోపాటు కూలీల పనిదినాలు తగ్గాయి. పని చేసిన కూలీకి రోజుకు రూ. 257 ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఏఒక్క కూలీకి రూ. 100కు మించడం లేదు. పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలైన టెంట్లు, మంచినీరు, గడ్డపారలు, పారలు, తట్టలు, డబ్బాలు అందించడం లేదు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గంటలు పని చేసిన కూలీకి రూ. 480 ఇవ్వాలని ఉన్నప్పటికీ ఉపాధిహామీ కూలీలకు మాత్రం కనీస కూలి అందడం లేదు. ఆన్లైన్ సిస్టం అమలు వల్ల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో సిగ్నల్ ఉండడం లేదు. ఉదయం పది గంటలు, సాయంత్రం నాలుగు గంటలకు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలనే నిబంధన ఉండడం వల్ల కూలీలు పనులకు దూరం అవుతున్నారు.
వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అసెంబ్లీ తీర్మానాన్ని అమలు చేయాలి. సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూలీలే అధికం. కాబట్టి వ్యవసాయాన్ని అనుసంధానం చేయడం వల్ల రైతులు, కూలీలకు గిట్టుబాటు అవుతుంది. పంట స్థాయిని బట్టి ఎకరాకు కూలీ టోకెన్లు, మస్టర్లో 100 పని దినాలు ఉండేలా చూడాలి. గ్రామీణ ప్రాంతంలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి మండలస్థాయి ఏపీవో వరకూ ఉద్యోగ, కార్మికులు వేలాది మంది పని చేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
– పెద్ది సుదర్శన్రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే