గూడూరు, ఫిబ్రవరి13 : పట్టపగలే నడిరోడ్డుపై తల్లీకొడుకు దారుణ హత్యకు గురయ్యారు. మంత్రాల నెపంతో మహబూబాబాద్ జిల్లా గూడూరులోని ప్రధాన సెంటర్లో ఇద్దరిపై ఇనుపరాడ్తో విచక్షణారహితంగా దాడి చేసి చంపడం సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి. గూడూరు మండలం బొల్లేపల్లికి చెందిన ఆలకుంట సమ్మక్క(60), కొమురయ్య దంపతులు, కొడుకు ఆలకుంట సమ్మయ్య(40)పై మంత్రాలు చేస్తున్నారనే నెపంతో అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శివరాత్రి కుమారస్వామి కక్ష పెంచుకున్నాడు. వీరికి కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై గతంలో కొమురయ్య, సమ్మయ్యపై కుమారస్వామి దాడి చేశాడు. దీంతో సమ్మయ్య వరంగల్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. కుమారస్వామి కూడా గూడూరులో ఆటో నడుపుకొంటున్నాడు. అయితే, తన కూతురి నిశ్చితార్థం ఉందని సమ్మయ్య కుటుంబంతో కలిసి ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. శనివారం గూ డూరులో సమ్మయ్య ఆటోకు అడ్డు తగిలి తనపై మీ కు టుంబం మంత్రాలు చేస్తున్నదని ఆరోపిస్తూ కుమారస్వామి దాడి కి యత్నించాడు. దీంతో అదేరోజు వారు పో లీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నిశ్చితార్థం అ యిపోవడంతో మంగళవా రం తమ ఫిర్యాదు గురించి పోలీస్ స్టేషన్కు వచ్చి ఆటోలో తిరిగి ఇంటికి బయల్దేరారు.
ఈ క్రమంలో గూడూరు అంబేదర్క్ సెంటర్ ప్రాంతంలో కుమారస్వామి తన ఆటోతో అడ్డు తగిలి ఇనుప రాడ్తో వారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తల్లి ఆలకుంట సమ్మక్క, కొడుకు సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందారు. కొమురయ్యకు చెయ్యి విరుగగా, సమ్మయ్య భార్య రజితకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. సీఐ ఫణీధర్, ఎస్సైలు రాణాప్రతాప్, నగేశ్, దిలీప్, ప్రవళిక చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన కొమురయ్యను మహబూబాబాద్ దవాఖానకు తరలించారు. భార్య రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఉన్మాదిలా దాడి చేసి హత్య చేసి పారిపోతుండగా కుమారస్వామిని స్థానిక యువకులు ధైర్యం చేసి పట్టుకుని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని పోలీసులు స్టేషన్కు తరలించారు. న్యాయం చేయాలని స్టేషన్ వద్ద బంధువులు ఆందోళన చేశారు.