వాజేడు/మహదేవపూర్, ఏప్రిల్ 30 : ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం ఎనిమిది అయ్యిందంటే చాలు సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పది దాటితే చాలు బయటకు వెళ్లలేని పరిస్థితి. మంగళవారం ఉమ్మడి వరంగల్లో గరిష్ఠంగా ములుగు జిల్లా వాజేడు మండలంలో 45.6 డిగ్రీలు నమోదు కాగా, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో 43 డిగ్రీలుగా ఉంది. నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, రహదారులు ప్రజలు లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. మండుతున్న ఎండల కారణంగా వడదెబ్బ గురయ్యే ప్రమాదం ఉన్నందుకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
మహదేవపూర్, ఏప్రిల్ 30 : వడదెబ్బతో మహదేవపూర్ మండలకేంద్రానికి చెందిన కొత్తవడ్ల శంకర్(35) మృతిచెందాడు. సోమవారం పని నిమిత్తం బయటకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా మంగళవారం ఉదయం చనిపోయాడు.