వనదేవతలు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చారు. ఎటు చూసినా దారులన్నీ నిండిపోయి కనిపించాయి. మొదట అమ్మవార్లకు తలనీలాలు సమర్పించి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెలపై ఎత్తు బంగారం, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, వస్ర్తాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం- నార్లాపూర్, మేడారం-తాడ్వాయి, ఊరట్టం-కాల్వపల్లి, కొత్తూరు ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి.
సుమారు 6లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. 5 కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలిచాయి. రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ములుగు ఎస్పీ శబరీష్ పర్యవేక్షించారు. రోడ్లపై వాహనాలు నిలువకుండా చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా క్యూలో అనుమతించారు.