నాలుగు రోజులు దంచికొట్టిన వానలు శుక్రవారం తెరిపినిచ్చినా వరద అలాగే కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్డ్యాములు మత్తడి పోస్తుండగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ఊరి చెరువును చూసి నిండుగా నీటితో కళకళలాడుతోంది. అలాగే వరద ప్రవాహానికి పెద్ద సంఖ్యలో చేపలు కొట్టుకొస్తుండడంతో మత్స్యకారుల పంట పండినట్లయింది.
ఇంకేముంది మత్తడి వల్ల వలలు వేయగా చిన్నాచితకా చేపలే గాక పది, పదిహేను కిలోల బంగారు తీగ, గ్యాస్కట్, తదితర రకాలు చిక్కాయి. దొరికిన చేపతో సెల్ఫీ దిగుతూ మురిసిపోయారు. ఇలా జనగామ, నర్సంపేట ప్రాంతాల్లో శుక్రవారం మత్సకారులతో పాటు సామాన్య ప్రజలు చేపల వేట సాగించడం కనిపించింది. వర్షాలు ఆలస్యంగా కురిసినా ఇటు రైతులు, మత్స్యకారుల ఉపాధికి జీవం పోశాయి.
– నమస్తే నెట్వర్క్, జూలై 21