Warangal | ఎక్కడి నుంచి వచ్చాయో పాడు కుక్కలు.. ఓ బాలుడిని దారుణంగా బలితీసుకున్నాయి. కాసేపట్లో కుటుంబంతో కలిసి రైలులో రాజస్థాన్లోని అజ్మీర్కు బయలుదేరాల్సి ఉండగా అంతలోనే అతడిని చుట్టుముట్టి హతమార్చాయి. కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే చిల్డ్రన్ పార్కు సమీపంలో శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సంచార జాతికి చెందిన చోటు (7)ను వీధికుక్కలు కొరికి చంపేయడం ఓరుగల్లువాసులను తీవ్రంగా కలిచివేసింది. బతుకుదెరువు కోసం సంచార జీవనం గడుపుతూ కాజీపేటకు వచ్చిన కుటుంబం, ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి గుండెలవిసేలా రోదించింది. బాధితులను ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్ ఎంజీఎం వైద్యశాలలో పరామర్శించి ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ప్రత్యేక అంబులెన్స్లో చిన్నారి మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించారు.
కాజీపేట/వరంగల్ చౌరస్తా, మే 19 : కుక్కల దాడిలో సంచారజాతికి చెందిన ఓ బాలుడు చనిపోయాడు. శుక్రవారం ఉదయం కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే చిల్డ్రన్ పార్కు సమీపంలో బహిర్భూమికి వెళ్లిన చోటు (7)పై వీధికుక్కలు దాడి చేసి చంపడం నగరంలో కలకలం రేపింది. కాజీపేట పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి (బెనరాస్)కి చెందిన మలహర్ సింగ్- సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. వీరిది సంచార జాతికి చెందిన కుటుంబం. వీరు రోడ్లపై గిల్ట్ ఉంగరాలు, చిన్నచిన్న వస్తువులు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటారు. ఇలా మూడు కుటుంబాలవారు కాజీపేటకు వచ్చారు. సంచార జీవనంలో భాగంగా రాజస్తాన్లోని అజ్మీర్ వెళ్లేందుకు గురువారం రాత్రి కాజీపేట రైల్వే స్టేషన్కు వచ్చారు. రైలు లేకపోవడంతో గురువారం రాత్రి కాజీపేట రైల్వే చిల్డ్రన్స్ పార్కు ప్రహరీ పక్కన చెట్లు కింద సేద తీరారు. ఉదయం కుటుంబ పెద్దలు కూరగాయలు తెచ్చుకునేందుకు వెళ్లారు. మలహర్ సింగ్ కొడుకు చోటు పార్కు సమీపంలో బహిర్భూమికి వెళ్లగా వీధి కుక్కలు ఒక్కసారిగా అతడి మీద పడి దాడి చేశాయి. కింద పడేసి గొంతు, తల, ఇతర భాగాల్లో కొరికాయి. అటుగా వెళ్లినవారు చెదరగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు పది నిమిషాల పాటు చోటుపై దాడి చేసిన కుక్కలు స్థానికుల అరుపులతో అతడిని వదిలి పరుగులు తీశాయి. దగ్గరికి వెళ్లి పరిశీలించగా అప్పటికే బాలుడు ఊపిరి వదిలాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, చోటు మృతదేహాన్ని, అతడి కుటుంబ సభ్యులను ఎంజీఎం దవాఖానకు తరలించారు.
బాలుడి కుటుంబసభ్యులను ఎంజీఎం వైద్యశాలలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పరామర్శించారు. మృతుడి తల్లిదండ్రులను ఓదార్చి ఘటన కారణాలను మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ దాస్యం మాట్లాడుతూ నగరంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వేరే రాష్ట్రం నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. వీధి కుక్కలదాడిలో ముక్కుపచ్చలారని బాలుడు చనిపోవడం మనసును కలచివేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతామన్నారు.మేయర్ సుధారాణి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో వీధికుక్కల నియంత్రణ కోసం స్టెరిలైజ్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వీధి కుక్కల సమస్యల పరిష్కారం కోసం ఇటీవలే కౌన్సిల్ సమావేశంలో నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసేందుకు తీర్మానించామని, త్వరగా కమిటీ వేసి ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చూస్తామని చెప్పారు. బాలుడి తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ప్రత్యేక అంబులెన్స్ను ఏర్పాటు చేసి బాలుడి మృతదేహంతో పాటు అతడి కుటుంబాన్ని స్వగ్రామం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాసి దగ్గరలోని జైపూరియా గ్రామానికి తరలించారు.
కుక్కల దాడిలో బాలుడు చనిపోయాడని తెలిసి చుట్టుపక్కలవారు చాలా మంది అక్కడికి చేరుకోగా, బాలుడి మృతదేహం వద్ద అతడి కుటుంబసభ్యులు రోదించిన తీరు చూపరులను కలిచివేసింది. అతడి చెల్లె ఏడుపు అందరి హృదయాలను ద్రవింపజేసింది. రైల్వే చిల్డ్రన్ పార్కు సమీపంలో వీధి కుక్కలు పెరిగాయని ఈ రోడ్డులో రాకపోకలు సాగించాలంటే భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ పాచి పని చేసే ఓ మహిళ కొడుకును వీధి కుక్కలు కరిచాయని, అతడు నాలుగు నెలల తర్వాత చనిపోయాడని వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెదడ లేకుండా చేయాలని కోరారు.
కాజీపేట రైల్వే పరిసర ప్రాంతంలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. కుక్కలను పట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. రైల్వే కాలనీలకు సమీపంలో రైల్వే జంక్షన్ ఉండడంతో వీధి కుక్కలు పెరిగాయి. రైళ్లు వస్తున్నప్పుడు కుక్కలు అక్కడికి చేరుకుని ప్రయాణికులు పడేసే ఆహారాన్ని తిని కాలనీలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ సుధారాణి ఆదేశాలతో కాజీపేటలో మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టే బృందాలను పంపారు. దీంతో రైల్వే క్వార్టర్స్ కాలనీల్లో వీధికుక్కలను పట్టుకుని వ్యాన్లో తరలించడంతో స్థానికులు కార్పొరేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.